వైఎస్ జగన్ ఇలాంటివారిని పార్టీలోకి ఎందుకు తీసుకుంటారో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీలోకి ఇలాంటివారిని ఎందుకు తీసుకుంటారో? అనే సందేహం ఇప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెన్నాడుతోంది. అంబటి రాంబాబు, కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్, జోగి రమేష్, రోజా తదితర నాయకుల పేర్లను ఉదహరిస్తూ ప్లీనరీలో కార్యకర్తల మధ్య చర్చ జరిగింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకన్నా ముఖ్యమంత్రి జగన్ పేరు, ప్రతిష్టలను వీరే మంటగలుపుతున్నారే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి పరువు తీస్తున్నారు..!
జగన్ ఇన్ని నెలలు జైలులో ఉన్నారు.. ఇన్ని అక్రమాలకు పాల్పడ్డారు.. ఇన్ని కేసుల్లో ముద్దాయి.. అని ప్రతిపక్ష పార్టీలు చెప్పడం వేరు.. సొంతపార్టీ నేతలు చెప్పడం వేరు. ప్లీనరీలో ప్రసంగించిన నేతల్లో కొందరు తెలుగుదేశం పార్టీని సవాల్ చేస్తూనే సొంతపార్టీని, పార్టీ అధినేత ప్రతిష్టను మంటగలిపారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇలాంటి అనుభవం ఇప్పుడే కాకుండా గతంలో జరిగిన కొన్ని సమావేశాల్లోను ఎదురైనప్పటికీ ప్లీనరీలో మాత్రం ఎక్కువ ప్రభావం చూపిందంటున్నారు.
ఈ నేతలే ప్రచారం చేస్తున్నట్లుంది?
దమ్ముంటే ఎవరైనా ముందుకు రావాలి.. తెలుగుదేశం పార్టీని కుమ్మేస్తాం, మడత పెట్టేస్తాం అంటే సినిమా డైలాగుల్లా ఉంటాయి కాబట్టి జనం నుంచి స్పందన వస్తుంది. కానీ తమ అధినేతే ఇన్ని నెలలు జైలులో ఉన్నాడు.. అయినా ఏం పీకారు.. ఇన్ని కేసులు ఉన్నాయి.. అయినా ఏం చేశారు.. అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టారు.. అయినా అధికారం మాకే వచ్చింది.. నిరాధార ఆరోపణలు చేశారు.. మళ్లీ జైలుకు పంపించాలని చూస్తున్నారు.. అంటూ చెప్పిందే చెబుతూ టీడీపీని విమర్శించడం ఏమోకానీ తమ పార్టీని, పార్టీ అధినేత పరువును మాత్రం గంగపాలు చేస్తున్నారంటూ శ్రేణులు విమర్శిస్తున్నాయి.
వీరి నోళ్లకు మూకుతాడు పడితేనే పార్టీకి భవిష్యత్తు!!
భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల్లోనైనా వేదికమీద మాట్లాడే సమయంలో ఇటువంటివారికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని, లేదంటే ప్రసంగంలో ఏం చెబుతున్నారో ముందే వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇటువంటి నేతలవల్లే ముఖ్యమంత్రి జగన్పై కేసులు ఉన్నాయని.. అక్రమాలకు పాల్పడ్డారని.. అంటూ ప్రచారం చేస్తున్నట్లుందికానీ జగన్ను పొగుడుతున్నట్లు, టీడీపీని విమర్శిస్తున్నట్లు లేదంటున్నారు.
కొంతమంది మంత్రులు కూడా తమ స్థాయికి తగినట్లు వ్యవహరించడంలేదని, వారిని కూడా అదుపులో ఉంచితేనే మరోసారి అధికారంలోకి రావాలనే ఆశలు నెరవేరతాయని, లేదంటే ఈ తరహా నేతలవల్లే పార్టీ పుట్టి మునగడం ఖాయమనే చర్చ ప్లీనరీలో జోరుగా సాగింది. ఇకనైనా ఇటువంటి నేతల నోటికి మూకుతాడు వేయాలని వైసీపీ కార్యకర్తలు కోరుతున్నారు.