జగన్ను ‘వాడు’అని ఎందుకంటానంటే: జేసీ నోటిదూల వెనక ఆసక్తికర వ్యాఖ్యానం
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో అయితే జేసీ మరింత గట్టిగా మాట్లాడతారు. జగన్ పై ఒంటికాలి మీద లేచే టీడీపీ లీడర్ ఎవరంటే.. దివాకర్ రెడ్డి. ఇక మీడియా ముఖంగా జగన్ ను సంబోధించే విషయంలో దివాకర్ ర
అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిది అదో తరహా. దురుసైన మాటతీరు గల నేతగా ఈయనకు పేరుంది. కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు.. అనే మాటలు కూడా జేసీ విషయంలో వినిపిస్తూ ఉంటాయి.
ఇక తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల విషయానికి వస్తే.. జేసీ చాలా ఘాటుగా మాట్లాడతారు. ఒక్కోసారి స్వపక్షం, విపక్షం అన్న తేడా కూడా మరిచిపోతారాయన. అప్పుడప్పుడు స్వపక్ష నేతల విషయంలో కూడా అదే ధోరణిలో మాట్లాడతారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో అయితే జేసీ మరింత గట్టిగా మాట్లాడతారు. జగన్ పై ఒంటికాలి మీద లేచే టీడీపీ లీడర్ ఎవరంటే.. దివాకర్ రెడ్డి. ఇక మీడియా ముఖంగా జగన్ ను సంబోధించే విషయంలో దివాకర్ రెడ్డి మరీ రెచ్చిపోతూ ఉంటారు కూడా.
జగన్ ని 'వాడు..' అని సంబోధించడం జేసీకి అలవాటు. రాజకీయ నేత అన్నాక కొంత డిప్లొమాటిక్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రత్యర్థిని కూడా గౌరవించి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే జేసీ మాత్రం ఇలాంటి ప్రొటోకాల్స్ ఏమీ పట్టించుకోరు. ప్రత్యేకించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విషయంలో అయితే ఎంత మాటైనా సరే అలవోకగా అనేస్తారు.
మరి జగన్ విషయంలో దివాకర్ రెడ్డి ఎందుకిలా నోరుపారేసుకుంటారనే విషయంపై తన తాజా ఇంటర్వ్యూలో జేసీ స్పందించారు. తను జగన్ ను 'వాడు' అనడంలో ఆయన్ని అగౌరవపరిచే ఉద్దేశం లేదని జేసీ స్పష్టం చేశారు.
''జగన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. అప్పట్లో 'రేయ్..'అనే వాళ్లం.. ఇప్పుడు కొత్తగా 'సార్' అనడం కుదురదు కదా..'' అంటూ చెప్పుకొచ్చారాయన. జగన్ ను 'వాడు..' అనడంలో వాత్సల్యమే తప్ప, అతడ్ని అగౌరవపరచాలనే ఉద్దేశం ఎంతమాత్రం ఉండదని, తాను పొగరుతో అలా పిలవనని వ్యాఖ్యానించారు.