జగన్ కేసుల్లో సీబీఐ ఎందుకు నెమ్మదిస్తోంది?: బాబులో మెదులుతోన్న ప్రశ్న!
జగన్ కేసుల విషయంలో సీబీఐ దర్యాప్తు నెమ్మదించడం పట్ల టీడీపీ నేతల వద్ద చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారట.
అమరావతి: ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్పై ఉన్న కేసుల విచారణపై టీడీపీకి గాలి మళ్లినట్టు తెలుస్తోంది. కేసుల విషయంలో సీబీఐ మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తోంది? విచారణ ఎందుకు నెమ్మదించింది? లాంటి ప్రశ్నలన్ని ఇప్పుడు టీడీపీ బుర్రలోకి దూరినట్టు సమాచారం.
జగన్ విషయంలో దర్యాప్తు సంస్థల విచారణ నెమ్మదించిందని ఇప్పటికే టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది. సీబీఐ దర్యాప్తు నెమ్మదించడం పట్ల టీడీపీ నేతల వద్ద చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారట.
జగన్ కేసుల సంగతి ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైందని, దీనిపై కేంద్రానికి, న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టుగా చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతల నిర్ణయానికి చంద్రబాబు కూడా ఓకె అన్నారని, సీబీఐ దర్యాప్తు నెమ్మదించడం వెనుక ఎవరో బలమైన వ్యక్తి ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.