జగన్ దావోస్ టూర్ వెనుక ? పెట్టుబడులు రావని తెలిసీ ! నాడు చంద్రబాబును విమర్శించి ?
దావోస్ లో ప్రతీ ఏటా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. ఇందులో ప్రపంచ దేశాలకు చెందిన పెట్టుబడి దారులతో పాటు ప్రభుత్వాధినేతలు, అధికార గణం కూడా భారీగా తరలి వెళ్తుంది. తమ దేశాల్లో, రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని అక్కడ పెట్టుబడిదారుల్ని కలిసి వినతులు సమర్పిస్తుంది. వారు ఇచ్చే ఆఫర్లు నచ్చితే పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకొస్తారు. లేకపోతే రానుపోను ఖర్చులూ దండగే. ఏపీలో గతంలో చంద్రబాబు ఇలా వెళ్లి వచ్చే టూర్లపై విమర్శలు చేసిన జగన్.. ఇప్పుడు తానే దావోస్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

దావోస్ లో పెట్టుబడుల వేట
స్విట్లర్లాండ్ లోని దావోస్ లో ఏటా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సుకు అంతర్జాతీయంగా ఓ గుర్తింపు ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడికి వచ్చే పారిశ్రామిక వేత్తల్ని, ప్రభుత్వాల్ని నామమాత్రపు ఛార్జీలు వసూలు చేసి ఒక్క చోటకు చేర్చి చర్చించుకునే అవకాశం కల్పించడం ఈ సదస్సు ప్రత్యేకత. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారితో పాటు ప్రభుత్వాధినేతలు కూడా తరలివస్తుంటారు. అలాగే మిగతా వ్యాపారాల్లో పెట్టుబులు పెట్టాలనుకునే వారు కూడా పరిచయాల కోసం వస్తుంటారు. వీరిని ఒక్క చోటకు చేర్చి లాబీయింగ్ చేయించడం ద్వారా అందరికీ ప్రయోజనం కల్పించాలన్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉద్దేశం.

చంద్రబాబు దావోస్ టూర్లు
గతంలో ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోచంద్రబాబు పలుమార్లు దావోస్ వెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు హాజరై వచ్చారు. భారీ ఎత్తున ఖర్చుపెట్టి దావోస్ వెళ్లి అక్కడ కూడా డబ్బులు పోసి పెట్టుబడిదారులతో సమావేశమైనా భారీగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు మాత్రం కనిపించలేదు. దీంతో విపక్షాలు అప్పట్లో చంద్రబాబు దావోస్ టూర్ అనగానే విమర్శలకు దిగేవి. వాటితో ఎలాంటి ప్రయోజనం లేదని, అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి అధినేత అయి ఉండి ఇష్టారాజ్యంగా డబ్బులు వృథా చేస్తున్నారని చంద్రబాబును అంతా టార్గెట్ చేసే వారు.

చంద్రబాబు బాటలోనే జగన్
గతంలో చంద్రబాబు దావోస్ టూర్ కు వెళ్లినప్పుడల్లా విపక్ష నేతగా ఉన్న జగన్ విమర్శలకు దిగేవారు. తన పార్టీ నేతలతో కలిసి విమర్శలు చేయించేవారు. దావోస్ కు వెళ్లి చంద్రబాబు తెచ్చిన పెట్టుబడులు ఏంటని ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడు తాను తొలిసారి దావోస్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది దావోస్ వెళ్లే అవకాశం వచ్చినా వెళ్లకుండా చంద్రబాబు ఉదంతాలు గుర్తు చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు మాత్రం దావోస్ పర్యనటను సమర్ధించుకుంటోంది. దీంతో దావోస్ టూర్ వల్ల ఒనగూడే ప్రయోజనం ఏంటో చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

జగన్ అసలు టార్గెట్ అదేనా ?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చిన ఆరునెలల తర్వాత తొలి పారిశ్రామిక విధానం అమల్లోకి తెచ్చిన జగన్ సర్కార్.. పరిశ్రమల్నిరాయితీలు లేకుండానే రాష్ట్రానికి రప్పిస్తామని గొప్పలు చెప్పుకుంది. మరోవైపు పరిశ్రమలు స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన పెట్టింది. ఇంకోవైపు అనంతపురంలో కియా పరిశ్రమ పెద్దల్ని స్ధానిక ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించారు. మరోవైపు గత ప్రభుత్వం పలు పరిశ్రమల కోసం ఇచ్చిన భూముల్నివైసీపీ సర్కార్ వెనక్కి తీసేసుకుంది. దీంతో మరో కొత్త పారిశ్రామిక వేత్త ఏపీవైపు చూడాలంటేనే భయపడే పరిస్ధితి వచ్చేసింది. మూడేళ్లలో కొత్త ప్రాజెక్టులు లేక రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేశామని చెప్పుకునేందుకే జగన్ దావోస్ వెళ్తున్నట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications