మావోయిస్టులు లేఖ ఎందుకు విడుదల చేయలేదు...మంత్రి అయ్యన్నపాత్రుడి ప్రశ్న
తిరుమల:మావియస్టులు ఏదైనా దాడి లేదా చర్యకు పాల్పడిన అనంతరం లిఖితపూర్వక లేఖను విడుదల చేస్తారని...కానీ అరకు ఘటనలో మాత్రం ఇంతవరకూ వారి నుంచి ఎలాంటి ప్రకటన లేదని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల హత్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలగుతుందన్నారు. ఇలాంటి ఘటనల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మావోయిస్టులు కేవలం తమ ఉనికిని చాటుకునేందుకే హత్యలకు పాల్పడుతున్నారని, ఇది అమానుషమన్నారు.
మావోయిస్టులకు ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అయ్యన్నపాత్రుడు సూచించారు. ఇదిలావుంటే మావోయిస్ట్ ల హిట్ లిస్ట్ లో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఉండటంతో ప్రభుత్వం ఆయనకు భద్రతను భారీ గా పెంచడమే కాకుండా పోలీసులు ఆయన కోసం ఒక బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కూడా సమకూర్చారు.

అయితే ఇటీవలే మంత్రి అయ్యన్న పాత్రుడి ఒక చర్య పోలీసులను ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. మావోల హిట్ లిస్టు లో ఉన్న మంత్రి అయ్యన్నపాత్రుడుకు పోలీసులు భారీ భద్రత కల్పించగా ఆయన అవేమీ పట్టించుకోకుండా మంగళవారం సాయంత్రం సరదాగా తన స్నేహితులతో కలసి నర్సీపట్నంలో అత్యంత రద్దీగా ఉండే శ్రీకన్య కూడలిలోని ఒక హోటల్కు వెళ్లడం పోలీసులను ఠారెత్తించింది.
అంతేకాకుండా ఆయన ఆ హోటల్ లో ఇతర కస్టమర్ల మధ్యే అల్పాహారం తీసుకుంటూ హల్ చల్ చేయడం పోలీసులను ఇబ్బంది పెట్టింది. పోలీసులు ఇప్పటికే ఆయనకు బులెట్ ప్రూఫ్ వాహనం భద్రతను కూడా కల్పించగా ఆయన అదేమీ పట్టించుకోకుండా ఇలా చేయడంపై పోలీసు అధికారులు ఆ ఘటనకు సంబంధించి తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications