రాజకీయాల్లో కుటుంబ సభ్యుల ప్రస్తావన ఎందుకు.?బాబుకు మద్దత్తుగా జనసేనాని.!
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్టు అసందర్బ విమర్శలు, వ్యాఖ్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు పవన్ కళ్యాణ్. తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కంట తడి పెట్టడం బాధాకరమన్నారు జనసేనాని. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉందని, ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు, చివరికి ప్రసారమాద్యమాల చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోంది ఆవేదన వ్యక్తం చేసారు పవన్ కళ్యాణ్.
Recommended Video
గౌరవనీయ ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయమని, ఈ వ్యాఖ్యలు వందకు వందశాతం ఖండించదగినవని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులను తక్కువచేసి కొందరు మాట్లాడినప్పుడు ఆనాడు కూడా ఆ వ్యాఖ్యలను ఇదే రీతిలో ఖండించిన సంగతిని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేసారు. ముఖ్యంగా ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు మరింత నియంత్రణ పాటించాల్సి ఉంటుందని అన్నారు. మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఉందని, లేని పక్షంలో ఇది ఒక అంటు వ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉందని, రాజకీయ వ్యవస్థను ప్రజల దృష్టిలో పలుచన చేయవద్దని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసారు.