రెడ్ హ్యాండెడ్గా, బాబును ఇంకా ఎందుకు వదిలేస్తున్నారు: జగన్ ప్రశ్న
న్యూఢిల్లీ: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇంకా ఎందుకు వదిలివేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రశ్నించారు. ఆయన రాష్ట్రపతి ప్రణబ్ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు టాపిగ్ డైవర్ట్ చేసేందుకు రెండు రోజులుగా బాగా కష్టపడుతున్నారన్నారు. ఏపీలో కుంభకోణం చేసి తీసుకు వచ్చిన డబ్బును తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెట్టారన్నారు. ఒక ఎమ్మెల్సీ గెలిచేందుకు 17 మంది ఎమ్మెల్యేలు కావాలని, అలా ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా రేవంత్ పట్టుబడ్డారన్నారు.
స్టీఫెన్ సన్కు చంద్రబాబు హామీ ఇచ్చిన ఆడియో టేపులు విడుదలయ్యాయని చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబును ఎందుకు వదిలేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. మరొకరైతే వదిలేసేవారా అని ప్రశ్నించారు. సామాన్యుడికి ఓ న్యాయం, సీఎంకు మరో న్యాయమా అన్నారు.
చంద్రబాబును ఏ1 నిందితుడిగా ఎందుకు పేర్కొనడం లేదన్నారు. చంద్రబాబు నిస్సిగ్గుగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడన్నారు. దీనిని రెండు రాష్ట్రాల వివాదంగా మార్చాలని చూడటం విడ్డూరమన్నారు. రాష్ట్రం విడిపోయి ఏడాది దాటినా ఇంకా ఇలా చేయడమేమిటన్నారు.
చంద్రబాబు ఏఫీని స్కాం ఆంధ్రప్రదేశ్గా మార్చారన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏపీలో సంపాదించి తెలంగాణలో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారన్నారు. చంద్రబాబును తాను ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని, చంద్రబాబును కటకటాల్లోకి పంపించాలని కోరుతానని చెప్పారు.
నేను ఓ ముఖ్యమంత్రిని అని, తనే ఫోన్లు ట్యాప్ చేస్తారా అని చంద్రబాబు అడుగుతున్నారని, అలా అన్నారంటే ఆయన స్టీఫెన్తో మాట్లాడినట్లు అంగీకరించినట్లే కదా అన్నారు. అలాంటప్పుడు చంద్రబాబును ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. దీనిని రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు.
నన్ను అనడం ఏమిటి
తాను తెరాసతో కలిసి కుట్ర చేస్తున్నారని చంద్రబాబు అన్న వ్యాఖ్యల పైన జగన్ స్పందించారు. చంద్రబాబు కుట్ర చేస్తూ పట్టుబడుతూ తనను విమర్శించడమేమిటన్నారు. తెరాసకు మద్దతు ఇవ్వడంపై స్పందిస్తూ.. రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నామన్నారు.
విభజన విషయంలో చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడుతారన్నారు. వరంగల్లో తన లేఖ వల్లే విభజన జరిగిందని చెబుతారన్నారు. చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు.
జైల్లో ఉండాలి
ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసే వ్యక్తి ఉండాల్సింది జైల్లో అన్నారు. చంద్రబాబును కాపాడకూడదని చెప్పేందుకే రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. టీడీపీ నేత లంచం ఇస్తూ పట్టుబడితే కుట్ర ఎలా అవుతుందన్నారు. తెలుగు మీడియాతో మాట్లాడిన జగన్ అనంతరం ఇంగ్లీష్ మీడియాతోను వివరాలు చెప్పారు.