అమిత్ షా కు "భీమ్" నచ్చాడు, ఓకే -"రామరాజు" నచ్చలేదా : కొత్త సమీకరణాలు..!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా..జూ ఎన్టీఆర్ భేటీ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అమిత్ షా బీజేపీ భవిష్యత్ రాజకీయాల వ్యూహంలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యరనే వాదన వినిపిస్తోంది. బీజేపీ నేతలు మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ భీమ్ పాత్ర చూసిన తరువాత ఎన్టీఆర్ ను ప్రత్యక్షంగా అభినందించాలని నిర్ణయించారని..అందులో భాగంగానే ఈ సమావేశం అని చెప్పుకొస్తున్నారు. అదే సినిమాలో భీం పాత్రలో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ను అభినందించిన అమిత్ షా కు..సమానంగా సీతారామారాజు పాత్రలో నటించిన రాం చరణ్ పాత్ర నచ్చలేదా అంటూ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.

జూ ఎన్టీఆర్ పాత్ర నచ్చిందంటూ
రాజకీయ వ్యూహ రచనలో దిట్ట అయిన అమిత్ షా రాజకీయ ప్రయోజనాలను..భవిష్యత్ అంచనాలతోనే జూనియర్ ను కలిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జూనియర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ భీమవరం కేంద్రంగా అల్లూరి సీతారామరాజు శత జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. అదే వేదిక పైన చిరంజీవిని ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. భుజం తట్టి అభినందించారు. ఆ సమావేశానికి పవన్ దూరంగా ఉన్నారు. ఇప్పటికే ఏపీలో పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. అటు టీడీపీ ని తమతో పాటు కలుపుకొనేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీ నేతల వాదన పై చర్చ
కానీ, బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీకి ఇప్పుడు తక్షణ టార్గెట్ తెలంగాణ. వచ్చే ఏడాది తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది. భవిష్యత్ లో ఏపీలోనూ పట్టు సాధించాలనేది బీజేపీ ప్రయత్నం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సామాజిక సమీకరణాలే కీలక పాత్ర పోషిస్తాయి. అదే సమయంలో సినీ హీరోల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని గమనించిన బీజేపీ అధినాయకత్వం అటు ఏపీలో ..ఇటు తెలంగాణలో తమ భవిష్యత్ వ్యూహాలకు అనుగుణంగా ఇప్పటికే నుంచే పావులు కదుపుతోంది. అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ మధ్య దాదాపు అరగంట సేపు ఏకాంత సమావేశం జరిగింది.

తెలుగు రాజకీయాల్లో కొత్త టర్న్
ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలతో పాటుగా.. ఆయన పాలన పైన అమిత్ షా వ్యాఖ్యలు చేసారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తన భవిష్యత్ సినిమా ప్రాజెక్టుల గురించి వివరించారు. ఇదే సమయంలో జూనియర్ సేవలు సమాజానికి అవసరమంటూ పరోక్షంగా రాజకీయ అవసరాల గురించి అమిత్ షా ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఈ సమావేశం అనేక కొత్త ఆలోచనలకు - అంచనాలకు కారణం అవుతోంది.












Click it and Unblock the Notifications