పవన్ బస్సు యాత్రకు బ్రేకులు పడ్డట్టేనా..?
పవన్ పోరాట యాత్ర ఏ మలుపు తిరిగింది ? పోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ సేద తీరుతున్నారు.? 2019 సార్వత్రిక ఎన్నికల లోపు రాష్ట్రంలోని 13జిల్లాలను తన పోరాట యాత్రను పూర్తి చేసి 175 స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించుతానని ప్రకటించిన పవన్ కార్యచరణ మాత్రం నత్త నడక నడుస్తోంది. పోరాట యాత్రలో భాగంగా ఇప్పటికే ఉత్తరాంధ్రలో దాదాపు పూర్తిచేయాల్సిన బస్సు యాత్రకు ఎందుకు బ్రేకులు వేస్తున్నారో ఎవ్వరికి అర్థంకాకుండా తయారయింది. పోరాట యాత్ర పేరుతో పార్టీకి మంచి జోష్ తెచ్చిన తరుణంలో ఆకస్మిక విరామం ఎందుకని పవన్ అభిమానులు ప్రశ్రిస్తున్నారు. అప్రకటిత విరామాన్ని ముగించి సాద్యమైనంత తొందరలో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు ఎందుకు బ్రేకులు పడ్డాయి..??
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో సీరియస్ నెస్ ఇంకా అలవాటు కాలేదా ? ఉత్తరాంధ్రలో ఏకదాటిగా 45 రోజులు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటానన్న పవన్ తన పర్యటనకు అర్థాంతరంగా విరామం ప్రకటించారు. దీంతో పవన్ రాజకీయ ప్రస్థానంపై పార్టీ అనుచరుల్లో గుబులు రేగుతోంది.
పర్యటనలో ఉండగానే కొన్ని రోజులు ‘ఫాం హౌస్‘కు పరిమితం అయిపోయారు. తర్వాత ఓ రెండు రోజుల పాటు కొనసాగించి తన భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది మైనారిటీలు ఉన్నారని చెప్పి ‘రంజాన్' సెలవులు ప్రకటించేశారు. రంజాన్ అయిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ తన యాత్ర మళ్ళీ ఎప్పటి నుంచి కొనసాగిస్తారో ఇంతవరకూ ప్రకటించలేదు.
13జిల్లాల్లో యాత్ర కొనసాగింపుపై అలుముకున్న నీలిమేఘాలు..
ప్రజాపోరాట యాత్రలో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఇది సాధ్యమైంది కూడా. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గతంలో విమర్శించినట్లు ఇంటర్వెల్స్ ఎక్కువ సినిమా తక్కువ అన్న చందంగా రాజకీయాలు చేస్తే ముందుకు సాగటం కష్టం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
పైగా సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ లోనే జరగటం పక్కా అనే అభిప్రాయం బలంగా ఉంది. అంటే ఇంకా ఎన్నికలకు నిండా ఆరు నెలల సమయం కూడా లేదు. మరి పవన్ రాష్ట్రంలో తన పర్యటనను ఎప్పుడు పూర్తి చేసుకుంటారు. 175 సీట్లలో అభ్యర్ధుల ఖరారు ఎప్పుడు పూర్తి చేస్తారు. ఈ సారైనా పూర్తి స్థాయిలో అభ్యర్ధులను బరిలో నిలబెట్టగలిగే పరిస్థితికి చేరుకుంటారా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పుడే అప్రకటిత విరామం ఐతే.. వర్షాకాలంలో ఎలా..??
జనసేన ఆవిర్భావ సభ సమయంలో కేడర్ కు ఇచ్చిన ‘కిక్'ను కంటిన్యూ చేయటంలో పవన్ కళ్యాణ్ విఫలమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పవన్ తన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇమేజ్ ఉన్న నాయకులను ఆకర్షించటంలో కూడా ఇంత వరకూ సక్సెస్ కాలేదనే చర్చ కూడా జరుగుతోంది.
ఉత్తరాంద్ర లో పర్యటన తర్వాత రాయలసీమలో పర్యటించి, ఆ తర్వాత కోస్తాంద్రతో ముగించాలని మొదట ప్రణాళిక రచించారు జనసేనాని. కాని ఉత్తరాంద్ర పర్యటన అనుకున్న గడువులోపు పూర్తి అవుతుందా అనే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. మరి కొన్ని రోజులు గడిస్తే వర్షాకాలం ముంచుకొస్తుంది. పవన్ యాత్ర వర్షా కాలం బడిలాగా కొనసాగుతుందా లేక సుజావుగా కొనసాగుతుందా అని పవన్ అభిమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
పవన్ ప్రజాక్షేత్రంలో ఉంటే ఆశించిన ఫలితాలు గ్యారంటీ అంటున్న క్యాడర్..
ఇంత వరకు జరిగిన పోరాటయాత్రలో పార్టీని ఒక రేంజ్ లో ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు పవన్. అదే ఊపును కొనపాగించాలంటే ఎంత తోందరగా యాత్రను కొనసాగిస్తే అంత మంచిదనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా పూర్తిచేసి, కొన్ని బాద్యతలను పార్టీ నాయకులకు అప్పగించి ప్రజా క్షేత్రంలో పవన్ ఉండాలని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.
ఏపీలో ఎంత ఉద్రుతంగా పర్యటిస్తే ఫలితాలు అంత ఎక్కువగా ఉంటామయనే చర్చకూడా జరుగుతోంది. ఏపిలో తెలుగుదేశం పార్టీ పైన ప్రజలకు విరక్తి పుట్టినా.. వైసీపి మీద విశ్వాసం కలగకపోయినా ప్రజలు ఆదరించేది జనసేనపార్టీనే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే వాస్తవాన్ని జనసేనాని గ్రహించి ప్రజాక్షేత్రంలో పర్యటనలకు పదును పెంచితే మంచి భవిష్యత్తు ఉంటుందనే చర్చకూడా జరుగుతోంది.