బీజేపీపై వ్యూహం: జగన్ దారిలో బాబు 'కక్ష సాధింపు'.. సెంటిమెంట్ అస్త్రం!?
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందా అంటే అవుననే అంటున్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు హఠాత్తుగా కక్ష సాధింపు చర్యలు అనే అంశాన్ని తెరపైకి తీసుకు రావడం చర్చనీయాంశంగా మారింది. తనకు జాతీయ రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని, అలాంటప్పుడు తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దారిలోనే చంద్రబాబు నడుస్తున్నారని అంటున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ వైసీపీని స్థాపించారు. అప్పటి నుంచి నిత్యం తనపై కాంగ్రెస్, టీడీపీ కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శలు గుప్పించారు.

అదే కార్డ్.. కాస్త భిన్నంగా
తనను ఎదుర్కోలేక టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని, ఆ పార్టీలు ఒక్కటై తనపై కేసులు పెట్టాయని జగన్, వైసీపీ నేతలు పలుమార్లు విమర్శించిన సందర్భాలు చూశాం. ఇప్పుడు అదే అస్త్రాన్ని చంద్రబాబు తీస్తున్నారని అంటున్నారు. అయితే, కాస్త భిన్నంగా ఉందని అంటున్నారు.

నాడు వారిద్దరి, నేడు వీరిద్దరు!
నాడు కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయని జగన్ విమర్శలు చేస్తే, ఇప్పుడు బీజేపీ-వైసీపీలు ఒక్కటయ్యాయని, టీడీపీని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. పవన్ గుంటూరు సభ, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చాక ఏపీ రాజకీయాలు హీటెక్కిన విషయం తెలిసిందే.

ఆ విమర్శలు సరే, కలవడం గురించే మాట్లాడటమా?
వైసీపీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిని పదేపదే ఆర్థిక నేరస్తుడు అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కేసులు ఉన్నందున వారు నిత్యం ఆ విమర్శలు చేస్తున్నారు. కానీ అలాంటి వారికి ప్రధాని అపాయింటుమెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించడం మాత్రం సరికాదని అంటున్నారు. ఎందుకంటే జగన్ స్వయంగా ఏపీ ప్రతిపక్ష నేత, విజయసాయి రాజ్యసభ సభ్యులు. కాబట్టి ప్రజాప్రతినిధులుగా వారు కలిస్తే ఏమిటని అంటున్నారు. కేసులు ఇంకా కోర్టు పరిధిలో ఉన్నాయని చెబుతున్నారు.

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా
చంద్రబాబు, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. ఏపీలో విపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటారా, కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఎన్ని కేసులు వేస్తారు, సీబీఐ కేసులు అంటూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. కేసులు వేసినా తాము సిద్ధమేనని టీడీపీ అంటోంది. జగన్ పైన కేసులు వేసిన తర్వాత ఎలా మాట్లాడారే, ఇప్పుడు టీడీపీ నేతలు బీజేపీ అలా ముందుకు వెళ్తుందనే అనుమానంతో అదేవిధంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.

సెంటిమెంట్ అస్త్రం
నాడు వైయస్ జగన్ కేసుల అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ తన తండ్రి సెంటిమెంటును ఉపయోగించుకునే ప్రయత్ననాలు చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కేసులు వేస్తారా, భయపెడతారా.. అంటూ టీడీపీ కూడా ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారని అంటున్నారు. తద్వారా బీజేపీ.. టీడీపీని అని చెప్పకుండా, ఏపీనే ఇబ్బంది పెట్టాలని చూస్తోందని సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications