చంద్రబాబు ఎవరి వైపు - పార్టీకి నష్టమేనా : మారుతున్న సమీకరణాలు..!?
చంద్రబాబు ఎవరి వైపు. మారుతున్న సమీకరణాలు పార్టీలో అంతు చిక్కటం లేదు.
చంద్రబాబు ఇరకాటంలో ఉన్నారా. ఎవరి వైపు నిలబడాలో తేల్చుకోలేకపోతున్నారా. ఎందుకీ మౌనం. చంద్రబాబును ఇంకా 2019 ఫలితాలు..పరిణామాలు వెంటాడుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నారు. ఏపీలో అధికారం దక్కించుకోవటం చంద్రబాబు ముందున్న అసలు లక్ష్యం. జనసేనతో టీడీపీ పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీతోనూ పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అక్కడ నుంచ సానుకూల స్పందన లేదు. ఇదే సమయంలో చంద్రబాబు తీరు చర్చకు కారణమవుతోంది. చంద్రబాబు అటు పీఎం మోదీ - ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరి విషయంలో వ్యవహరిస్తున్న తీరు పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ గా మారింది.

చంద్రబాబు మౌనం వెనుక...
టీడీపీ అధ్యక్ష హోదాలో రెండు తెలుగు రాష్ట్రాల్లొనూ పార్టీ కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు తీరులో మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ సభలు..సమీక్షలు చేస్తున్న చంద్రబాబు అక్కడి ప్రభుత్వం ..తెలంగాణ రాజకీయాల గురించి మాత్రం మాట విప్పటం లేదు. తెలంగాణలో కొంత కాలంగా రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..లిక్కర్ స్కాం లో అరెస్ట్ లు..షర్మిల హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తీరు...మెడికో ప్రీతి ఆత్మహత్య ..కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు...ఇలా పలు అంశాలు చోటు చేసుకున్నాయి. కానీ, చంద్రబాబు ఏ అంశంలోనూ నోరు విప్పలేదు. ఎక్కడా స్పందించలేదు. ఈ రెండు అంశాలు ఒక విధంగా ప్రధాని మోదీ వర్సస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా చోటు చేసుకున్న పరిణామాలే. అదే సమయంలో రాష్ట్రంలో పాలనా పరంగా ప్రశ్నించాల్సిన విషయాలలోనూ మౌనమే పాటిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీల పైన ఒక్క మాట మాట్లాడటానికి చంద్రబాబు ముందుకు రావటం లేదు. కేవలం ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో పార్టీలో చేరాలని భావిస్తున్న నేతలు సైతం వెనుకడుగుకు కారణంగా చర్చ సాగుతోంది.

2019 పరిణామాల ఎఫెక్ట కారణమా
2014లో తెలంగాణలో కేసీఆర్.. ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. ఇద్దరి మధ్య కొంత కాలం సత్సంబంధాలే ఉన్నాయి. కానీ, రేవంత్ రెడ్డి ఓటు కు నోటు వ్యవహారంలో దొరికిన తరువాత ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. సవాళ్ల దాకా వెళ్లాయి. ఆ తరువాత చంద్రబాబుకు తాను రిటర్న్ గిప్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ 2019 ఎన్నికల సమయంలో బయటకు వచ్చింది. కాంగ్రెస్ తో జత కట్టింది. తెలంగాణలో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. మోదీ పైన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అంచనాలకు భిన్నంగా కేంద్రంలో మోదీ అధికారం దక్కించున్నారు. ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయింది. ఆ సమయంలో జగన్ గెలవాలని అటు ప్రధాని మోదీ.. ఇటు కేసీఆర్ కోరుకున్నారు. వారిద్దరి సహకారం జగన్ కు ఉందనేది టీడీపీ వాదన. కానీ, ఇప్పుడు ఏపీలో జరిగే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య. ఈ సారి మాత్రం 2019 తరహా నిర్ణయాలకు చంద్రబాబు సిద్దంగా లేరు. జగన్ తో సఖ్యతగా ఉండే నేతలతో దూరం పెంచుకొని..తాను విరోధిగా మారటానికి ఇష్టపడటం లేదు. అందుకే తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన ఎక్కడా నోరు విప్పటం లేదు.

పార్టీకి నష్టం.. చంద్రబాబుకు కలిసొచ్చేనా
అటు ప్రధాని మోదీని అవకాశం వచ్చిన ప్రతీ సందర్బంలోనూ చంద్రబాబు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపైన వ్యతిరేక వ్యాఖ్యలు మాత్రం చేయటం లేదు. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం రావాలని పిలుపునిస్తున్నారు. అసలు తెలంగాణ అంశాలపైన స్పందించని చంద్రబాబు..పార్టీకి పూర్వ వైభవం ఎలా తెస్తారనేది చర్చు కారణమవుతోంది. ఏపీలో జగన్ ను విమర్శించేందుకు డాక్టర్ సునీతకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు. జగన్ సోదరి షర్మిలను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అంశం వివాదాస్పదంగా మారినా చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబు ఏపీలో అధికారం కోసమే ఈ మౌనం పాటిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తమతో పొత్తు లేకపోయినా..జగన్ కు ఎన్నికల వేళ కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి సహకారం ఉండకూడదని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఏపీకి సరిహద్దు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కూడా ఎన్నికల వేళ కీలకమే. దీని కారణంగా కేసీఆర్ తో వైరం కోరుకోవటం లేదు. చంద్రబాబు ఇలా మౌనం పాటించినా.. అటు ప్రధాని మోదీ..ఇటు కేసీఆర్ ఆలోచనల్లో మార్పు ఉంటుందా. దీంతో..ఎన్నికల నాటికి చోటు చేసుకొనే సమీకరణాల పైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications