ఏమయ్యా.. ఇలా చేస్తారా?.. దళితుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు రానివ్వరా!: యనమలను నిలదీసిన శమంతకమణి
అదే రోజు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను లోకేష్ పోలవరం ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లడంతో.. వారెవరూ పెళ్లికి వెళ్లలేదు.
Recommended Video

అమరావతి: పెళ్లిళ్ల సీజన్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోను అదే సందడి నెలకొంది. ఈ నెల 23, 36 తేదీల్లో లక్షల్లో పెళ్లిళ్లు ఉన్నట్టు చెబుతున్నారు. అటు పలువురు ఏపీ రాజకీయ నేతల ఇళ్లలోను పెళ్లి భాజాలు మోగుతున్నాయి.
ఇటీవలే టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి మనవరాలి వివాహం కూడా జరిగింది. అయితే ఆ పెళ్లికి టీడీపీ నేతలెవరూ పెద్దగా హాజరుకాకపోయేసరికి ఆమె చిన్నబుచ్చుకున్నారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఇదే విషయమై ఆమె యనమలతో మాట్లాడారు.

దళితుల ఇళ్లలో శుభకార్యానికి రారా?:
బుధవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిసిన తరువాత లాబీల్లో యనమల, శమంతకమణి పరస్పరం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా శమంతకమణి ఆయనతో మాట్లాడారు. ' మా దళితుల ఇళ్లల్లో వివాహానికి ఎవరిని రానివ్వరు. అదే మీ ఇళ్లల్లో పెళ్లయితే మాత్రం ఏకంగా అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలనే నిలిపేస్తారా?' అంటూ శమంతకమణి యనమలను ప్రశ్నించారు.

ఏమయ్యా.. ఇలా చేస్తారా?
'ఏమయ్యా.. దళితులకు ఎలాగు పదవులు ఇవ్వరు. గౌరవం ఎటూ లేదు. కనీసం మా ఇంట్లో వివాహం జరుగుతుంటే రాకుండా చేస్తారా?' అంటూ శమంతకమణి మంత్రి యనమలను నిలదీశారు. ఆరోజే అందరిని పోలవరం తీసుకెళ్లాలా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆరోజు పోలవరం వద్దకు
ఈ నెల 16న శమంతకమణి మనవరాలి వివాహం అనంతపురంలో జరిగింది. వివాహానికి రావాల్సిందిగా టీడీపీ నేతలందరిని ఆమె ఆహ్వానించారు. కానీ అదే రోజు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను లోకేష్ పోలవరం ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లడంతో.. వారెవరూ పెళ్లికి వెళ్లలేదు. దీంతో తమ ఇంట్లో పెళ్లికి రానివ్వకుండా.. దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని శమంతకమణి నొచ్చుకున్నారు.

పయ్యావుల విషయంలో మరోలా:
శమంతకమణి కుమార్తె వివాహానికి ఎవరూ వెళ్లకపోవడం.. మరోవైపు ఈ నెల 23న పయ్యావుల కేశవ్ సోదరుడి కుమార్తె వివాహం నేపథ్యంలో ఏకంగా అసెంబ్లీ, శాసనమండలిలకు విరామం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై శమంతకమణి యనమలను నిలదీశారు.
ప్రతిపక్షం లేకుండా అధికారపక్షమే సభ నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. టీడీపీ సభ్యుల నిర్ణయం మేరకు సభకు 23, 24, 25 తేదీల్లో విరామం ప్రకటించారు. 23వ రోజు పయ్యావుల కేశవ్ ఇంట శుభకార్యం జరగనుంది. దీంతో ఆయన ఇంట్లో పెళ్లి కోసమే అసెంబ్లీ, శాసనమండలిలకు విరామం ప్రకటించారని శమంతకమణి అంటున్నారు.












Click it and Unblock the Notifications