జగన్కు వరుస ఎదురు దెబ్బలు: వెనక బలమైన కారణాలే...
అమరావతి: కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని పోటీకి దింపకపోవడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార తెలుగు దేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. పోటీకి అభ్యర్థిని దింపకపోవడం వెనక జగన్కు స్పష్టమైన అవగాహన ఉందని అంటున్నారు.
వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని దింపి కష్టాల పాలు కావడం ఎందుకనే ఉద్దేశంతోనే ఆయన వ్యవహరించినట్లు చెబుతున్నారు. పార్టీలోని కొంత మంది నాయకులు తొలుత ఆయన నిర్ణయం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఒకరిద్దరికి నచ్చకపోయినా తర్వాత
జనవరిలో జరగనున్న కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలనే జ జగన్ నిర్ణయం ఒకరిద్దరికి నచ్చలేదు. వారు స్వతంత్రంగానైనా పోటీకి దిగుతామని చెప్పి చూశారు. వారిలో గౌరు వెంకటరెడ్డి జగన్ను ఒప్పించి పోటీకి దిగాలని ప్రయత్నించారు. అయితే, జగన్ పరిస్థితిని వివరించడంతో ఆయన వెనక్కి తగ్గారు. ప్రస్తుతం జగన్ నిర్ణయం పట్ల పార్టీ శ్రేణుల్లో సానుకూలత వ్యక్తమవుతోంది.

సాంకేతికంగా మెజారిటీ ఉన్నప్పటికీ..
సాంకేతికంగా గత ఎన్నికల్లోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తగిన మెజారిటీ ఉంది. అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ వలసలను ప్రోత్సహించడంతో వైసిపి ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి అనూహ్యంగా వైసిపిలోకి వచ్చారు.
Recommended Video


రాజీనామా చేసి మరీ వచ్చారు..
తన పార్టీలో చేరేముందు టిడిపి వల్ల పొందిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ షరతు విధించారు. అందుకు శిల్పా కూడా అంగీకరించి రాజీనామా చేశారు. దీంతోనే నైతికంగా జగన్ చంద్రబాబుపై విజయం సాధించినట్లు భావించారు. చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జగన్ ఆ నిర్ణయం తసుకోవడం ప్రశంసలు పొందింది.

పోటీ చేస్తే కష్టాలు ఇవీ...
అభ్యర్థిని పోటీకి దింపితే ప్రస్తుతం గెలిచే మెజారిటీ లేదు. పైగా సొంత ప్రజాప్రతినిధులను కాపాడుకోవడానికి క్యాంపులు పెట్టాల్సి వస్తుంది, అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజాప్రతినిధులను కాపాడుకోవడం అంత సులభం కాదని గత ఎన్నికల్లోనే జగన్కు అనుభవంలోకి వచ్చింది. దీంతో పోటీ చేసి అవన్నీ చేయడం కన్నా పోటీకి దిగకపోవడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నారు.

జరిగే నష్టం ఊహించే ఇలా..
ఒకరిద్దరి ఉత్సాహాన్ని చూసి పోటీకి సిద్ధపడితే ఓటమి పాలైతే దాని ప్రభావం పార్టీ కార్యకర్తల స్థైరాన్ని దెబ్బతీస్తుందని జగన్ భావించినట్లు చెబుతున్నారు. తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎమ్మెల్సీ పోటీకి దిగి ఓటమి పాలైనప్పటి నుంచి ఇటీవలి నంద్యాల ఉప ఎన్నిక వరకూ వైసిపి గెలిచిన పాపాన పోలేదు. ఇప్పుడు అదే అనుభవాన్ని కొని తెచ్చుకోవడం జగన్కు ఇష్టం లేదని అంటున్నారు.

పోటీకి దింపకపోవడం వల్ల నష్టమేమీ లేదు..
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి దించకపోవడం వల్ల కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదని, తగిన బలం లేదు కాబట్టి పోటీ పెట్టలేదని ప్రజలు అనుకుంటారని జగన్ భావించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడేందుకే పోటీకి దించడం లేదనే అభిప్రాయాన్ని కూడా ఇప్పటికే పార్టీ ముందుకు తెచ్చింది. ఇది తమకు నైతిక బలాన్ని ఇస్తుందని జగన్ నమ్ముతున్నారు.












Click it and Unblock the Notifications