పత్తిపాటి సవాల్ను జగన్ ఎందుకు స్వీకరించలేదంటే, ఇరుకునపడ్డ బాబు: రోజా
అమరావతి: ప్రత్యేక హోదాపై కేంద్రంతో చంద్రబాబు ప్రభుత్వం లాలూచీ పడిందని, అగ్రిగోల్డ్ అంశంపై చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారని, ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుందని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం మండిపడ్డారు.
అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు సభను పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే సాక్షి మీడియానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీశారు.
ప్రత్యేక హోదాపై..
ఉదయం ప్రత్యేక హోదా గురించి వాయిదా తీర్మానం ఇచ్చామని, కానీ అది అయిపోయిందని టిడిపి ప్రభుత్వం చెబుతోందన్నారు. ఎన్నికలకు ముందు పదేళ్ల ప్రత్యేక హోదా కోసం బీజేపీ, చంద్రబాబు డిమాండ్ చేశారని, ఇప్పుడు గెలిచి అసెంబ్లీకి వచ్చాక మాత్రం మాట మార్చుతున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదాపై కచ్చితంగా సభలో చర్చ జరగాలన్నారు. కేంద్రంతో చంద్రబాబు లాలూచీ పడ్డారన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఏపీ ప్రజల గొంతు కోస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం కూడా హోదా విషయంలో తప్పించుకుంటోందన్నారు.
అందుకే జగన్ సవాల్ స్వీకరించలేదు
అగ్రిగోల్డ్ విషయంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు సవాల్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందన్నారు. 32 లక్షల మంది బాధితులను పట్టించుకోవడం లేదన్నారు.
అగ్రిగోల్డ్ పైన తమ పార్టీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై హౌస్ కమిటీ వేస్తామని ప్రభుత్వం చెబుతోందని, హౌస్ కమిటీ వేస్తే ఏడుగురు సభ్యులు వారు ఉంటారని, ఒకరు తమ పార్టీ ఉంటారని, అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు. అందుకే జగన్ మంత్రి పత్తిపాటి సవాల్ స్వీకరించలేదన్నారు.
జగన్ సవాల్తో చతికిలపడ్డ ప్రభుత్వం
తాము హౌస్ కమిటీ కాకుండా.. జ్యూడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. దానికి వారు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని రోజా నిలదీశారు. జ్యూడిషియల్ విచారణకు రావాలని, అప్పుడు నిరూపిస్తే రాజీనామా చేస్తారా అని ప్రతి సవాల్ విసిరారు.
ప్రభుత్వం హౌస్ కమిటీ వేస్తామని చెప్పిందని, హౌస్ కమిటీ కూడా మరో ప్రివిలేజ్ కమిటీ అవుతుందని, అందుకే జగన్ జ్యూడిషియల్ విచారణ అడిగారని, జగన్ సవాల్తో ప్రభుత్వం చతికిలపడిందన్నారు. వైసిపి ఎదురుదాడితో ప్రభుత్వం ఇరుకున పడిందని చెప్పారు.
స్పీకర్ ప్రతిష్టపై..
ఇప్పుడేదో తాము ప్రతిజ్ఞలో నిలబడకుంటే స్పీకర్ను అవమానించినట్లు మాట్లాడుతున్నారని, గతంలో స్పీకర్కు తెలియకుండా అసెంబ్లీ వీడియో క్లిప్పింగులు దొంగిలించి, ప్రసారం చేసినప్పుడు ఏమయిందో చెప్పాలని రోజా నిలదీశారు. అప్పుడు స్పీకర్ ప్రతిష్టకు భంగం వాటిల్లలేదా అని నిలదీశారు. క్లిప్పింగులను సాక్షి ఒక్కటే ప్రసారం చేయలేదని, ఇతర చానళ్లు కూడా ప్రసారం చేశాయన్నారు.