జూనియర్ ను అలా వాడుకోలేక- ఇలా వాడేసుకుంటున్న వైసీపీ-ఆత్మరక్షణలో టీడీపీ!
గతంలో టీడీపీని వీడి కొడాలి నాని వైసీపీలో చేరిన సమయంలో ఆయనకు సన్నిహితుడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ పార్టీకి దూరమవుతారని అంతా భావించారు. దీనిపై కొడాలి నాని అప్పట్లో చేసిన వ్యాఖ్యలతో జూనియర్ సైతం ఇరుకునపడ్డారు. చివరికి తానే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా జూనియర్ ను టీడీపీ దూరంగానే ఉంచుతోంది. అలాగని వైసీపీ కూడా దగ్గర తీసుకోలేని పరిస్ధితి. ఇప్పుడు అమిత్ షా తో ఆయన భేటీ నేపథ్యంలో వైసీపీ దీన్నే అవకాశంగా మార్చుకుంటోంది.
Recommended Video
జూనియర్ ఎన్టీఆర్-అమిత్ షా భేటీ
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వనం మేరకు ఆయన్ను విందు సమావేశంలో కలిసివచ్చారు. ఈ భేటీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీతో చేరతారా, టీడీపీ-బీజేపీ పొత్తుకు మధ్యవర్తి కాబోతున్నారా, జూనియర్ ఆధ్వర్యంలో టీడీపీని చీల్చి బీజేపీ పొత్తు పెట్టుకోబోతోందా.. ఇలా రకరకాల ఊహాగానాలకు ఈ భేటీ తావిచ్చింది. అయితే ఆ భేటీ తర్వాత కూడా ఇరు పార్టీల నేతలు స్పందించినా వీరిద్దరూ ఏమాట్లాడుకున్నారనే దానిపై పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు. ఆలోపే వైసీపీ దీన్నివాడుకోవడం మొదలుపెట్టేసింది.
జూనియర్ ను వాడుకోలేని వైసీపీ
ఒకప్పుడు జూనియర్ కు సన్నిహితుడిగా ఉంటూ, టీడీపీలో గుర్తింపు దక్కలేదని భావించి ఆ పార్టీని వీడిన కొడాలి నానిని అక్కున చేర్చుకున్న జగన్.. ఆ తర్వాత ఆయన్ను మంత్రిని కూడా చేసారు. అంతేకాదు చంద్రబాబు, లోకేష్ పై నిత్యం విమర్శలకు ఆయన్ను ఓ రేంజ్ లో వాడేసుకున్నారు. అయితే ఆయనకు సన్నిహితుడైన జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వాడుకోలేని పరిస్ధితి.
గతంలో రాజకీయాలకు దూరమని ప్రకటించి సినిమాలకే పరిమితమవుతున్న జూనియర్ ను జగన్ కనీసం సినీ ప్రముఖులతో భేటీకి కూడా ఆహ్వానించలేదు. ఏదో ఒక రోజు టీడీపీ పగ్గాలు జూనియర్ కే దక్కుతాయని, లేదా కనీసం ప్రచారానికైనా చంద్రబాబు ఆయన్ను వాడుకోవడం ఖాయమని భావిస్తుండటం వల్లే జూనియర్ ను వైసీపీ పట్టించుకోలేదు. కానీ తాజాగా అమిత్ షా తో భేటీ తర్వాత సమీకరణాలు మారాయి.
జూనియర్ ను పట్టించుకోని టీడీపీ
అదే సమయంలో మంచి వాక్ధాటి, సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో ప్రజల్లో ఆదరణ కలిగిన జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చురుగ్గా ఉంటే తన కుమారుడు లోకేష్ కు ఇబ్బందికరంగా మారుతుందన్న భయంతో చంద్రబాబు ఆయన్ను టీడీపీకి దూరంగా పెట్టేసినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే మధ్యలో కుటుంబ కార్యక్రమాల్లో మాత్రం చంద్రబాబు, జూనియర్ కలుస్తూనే ఉన్నారు. అయినా వీరిద్దరి మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవని, తన కుమారుడి కోసం జూనియర్ ను రాజకీయాలకు దూరం చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో టీడీపీ ప్రస్తుత పరిస్ధితుల్లో జూనియర్ ను పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.
వైసీపీ మైండ్ గేమ్ వెనుక కారణమిదే?
అయితే వైసీపీ మాత్రం తమకు ఎలాగో పనికిరాని జూనియర్ ఎన్టీఆర్ ను అటు టీడీపీకి కూడా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో టీడీపీకి దూరంగానే ఉంటున్న జూనియర్.. చంద్రబాబు పార్టీని చీలుస్తారని, ఏక్ నాథ్ షిండే అవుతారని ప్రచారం చేస్తూ మైండ్ గేమ్ ప్రారంభించింది. తద్వారా జూనియర్ నాయకత్వంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న వారంతా చంద్రబాబుపై ఒత్తిడి మరింత పెంచుతారనేది వైసీపీ వ్యూహం.
అయితే ఈ ట్రాప్ లో పడకుండా టీడీపీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. దీంతో వైసీపీ ఎత్తులు పారడం లేదు. అయినా వైసీపీ నేతలు మాత్రం అమిత్ షాతో జూనియర్ భేటీని అవకాశంగా తీసుకుని ఇలాంటి ప్రచారాన్ని బలంగా తెరపైకి తెస్తున్నారు.