భర్తను హతమార్చిన భార్య, ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
అమరావతి: కుటుంబ కలహాలతో భర్తను హతమార్చిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముదినేపల్లి మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన ఉప్పాల రామంజనేయులు, సుజాత దంపతులు తరుచూ గొడవపడుతూ ఉండేవారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మద్యం సేవించి వేధింపులకు గురిచేస్తున్న భర్తను సుజాత పచ్చడి బండతో తలపై మోదింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన రామంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. ముదినేపల్లి ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో ప్రబలిన విష జ్వరాలు
కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలం మాజేరు గ్రామంలో దాదాపు 600 మందికి పైగా ప్రజలు విష జ్వరాల బారిన పడ్డారు. గ్రామంలోని ప్రతి ఇంటిలో విష జ్వర బాధితులున్నారు. సమాచారం అందుకున్న వైద్య ఆరోగ్య శాఖ తక్షణ చర్యలకు ఉపక్రమించింది.
గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన వైద్యులు, పరిస్ధితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలోని పరిస్ధితిని మంత్రి దేవినేని సమీక్షించారు.
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని తినవేమలి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంగారమ్మ(29) తన కుమార్తె చిట్టి(4), కొడుకు చరణ్తేజ(10 నెలలు) తో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications