ప.గో.లో పెళ్లైన 4 నెలలకే.. భర్త గల్ఫ్ వెళ్లాడని, కర్నూలులో డాక్టర్ హత్య
ఏలూరు: పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం శివారు గొల్లగుంటపాలెంలో సోమవారం నాడు చోటు చేసుకుంది. గొల్లగుంట పాలేనికి చెందిన గాయత్రికి అదే గ్రామానికి చెందిన చంద్రారావుతో ఫిబ్రవరిలో వివాహం అయింది.
చంద్రా రావు పెళ్లికి ముందు నాలుగేళ్ల ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆషాడ మాసం కావడంతో గాయత్రి పుట్టింటికి వెళ్లింది. పెళ్లైన తర్వాత గత నెలలో చంద్రారావు మళ్లీ గల్ఫ్ వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన గాయిత్రి ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది.
పొలం పనులకు వెళ్లి వచ్చిన గాయత్రి తల్లి.. తన కూతురు అపస్మారకస్థితిలో ఉండటంతో ఇరుగుపొరుగు వారి సాయంతో ఆసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.

కర్నూలు జిల్లాలో దారుణ హత్య
కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్లో దారుణ హత్య జరిగింది. ప్రభుత్వ వైద్యుడిని కిరాతకంగా హత్య చేశారు. శైలేంద్ర రెడ్డి అనే వ్యక్తి గాజులపల్లి ప్రాథమిక వైద్య కేంద్రంలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి నలుగురు యువకులతో కలిసి నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ వైన్ షాపు వద్ద మద్యం కొనుక్కున్నారు.
వైద్యుడు నలుగురు యువకులతో కలిసి మద్యం సేవించాడు. వైన్ షాపు నుంచి కొంచెం దూరం వెళ్లిన తర్వాత వైద్యుడికి మిగతా నలుగురు యువకులకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో శైలేంద్ర రెడ్డిని నలుగురు యువకులు బండరాయితో దారుణంగా కొట్టి పారిపోయారు.
పెట్రోలింగ్ పోలీసులు రోడ్డుపై పడి ఉన్న వైద్యుడిని గుర్తించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు. వైద్యుడిని హత్య చేసిన నలుగురు యువకులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications