హైకోర్టు తీర్పుతో అమరావతిలో ఇళ్ల స్ధలాలకు లైన్ క్లియర్ కాలేదా ?
అమరావతిలో వైసీపీ సర్కార్ నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం చేస్తున్న ప్రయత్నాలకు నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊతం లభించింది. అయితే ఇప్పటికిప్పుడు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసేస్తారా అంటే లేదనే సమాధానమే వస్తోంది. దీనికి కారణం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఏం జరగబోతోందో ఇప్పుడు చూద్దాం..
అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాలు పంపీణీ చేసేందుకు వీలుగా ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇందుకోసం జీవో నంబర్ 45 కూడా ఇచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 45 వేల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. నిన్న కీలక ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం అమరావతిలో పేదల ఇళ్ల స్ధలాల కోసం 1100 ఎకరాల్లో ప్లాట్లు వేసి కేటాయించేందుకు అనుమతి లభించినట్లయింది. అమరావతిలో రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని పేదలకు పంచడం కుదరదంటూ రైతులు చేస్తున్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే రాజధానిలో భూముల కేటాయింపులపై మరో కీలక ఆదేశం కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టులో రాజధాని పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో తుది తీర్పు ఆధారంగానే ఈ ఆదేశాలు అమలవుతాయని కూడా తెలిపింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే తమ ఆదేశాలు వర్తిస్తాయని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అమరావతిలో ఇళ్ల స్ధలాల కేటాయింపు కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి వీలు కలిగింది. అయితే కేటాయింపు పూర్తి చేసి లబ్దిదారులు వాటిని తీసుకునేందుకు మాత్రం ఇంకా అనుమతి లభించలేదు. సుప్రీంకోర్టు రాజధాని వ్యవహారం తేల్చిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. అలాగే అమరావతిలో ఇతరులకు ఇళ్ల స్ధలాల కేటాయింపు కుదరదని సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు ఆదేశాలు అమలు కావు.












Click it and Unblock the Notifications