రాష్ట్రపతి రేసులో ఉన్న వెంకయ్యనాయుడుకు జగన్ మద్దతు ఉంటుందా..?
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 25వ తేదీతో ముగుస్తోంది. తదుపరి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడమనేది భారతీయ జనతాపార్టీకి పెద్ద టాస్క్ లా మారింది. అవసరమైనన్ని ఎలక్టోరల్ ఓట్లు లేవు. బీజేపీతోపాటు ఎన్డీయేలోని మిత్రపక్షాలను కలుపుకున్నా 9,194 ఓట్లు తక్కువవుతున్నాయి. రామ్నాథ్ కొవింద్ ఎన్నిక సమయంలో ఆప్, శివసేన, టీఆర్ఎస్, అకాలీదళ్ మద్దతిచ్చాయి. తాజాగా ఈ పార్టీలకు, బీజేపీకి యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీల మద్దతు అవసరమవుతోంది.

దక్షిణాదిపై బీజేపీ గురి
ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి పదవికి పోటీపడతారనే వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దక్షిణాది లో బీజేపీని బలోపేతం చేసుకోవాలనే యోచనలో ఉన్న పార్టీ నేతలు వెంకయ్యనాయుడైతే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొస్తున్నారు. మరో ఇద్దరు గవర్నర్ల పేర్లు కూడా వార్తల్లో నిలుస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మొగ్గు వెంకయ్యనాయుడిపై ఉంది.

అడిగినా, అడగకపోయినా సహకరిస్తున్న వైసీపీ!
అడిగినా, అడగకపోయినా లోక్సభలోకానీ, రాజ్యసభలోకానీ బీజేపీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోపాయికారీగా సహకరిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే రాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన ఓట్లు వైసీపీ నుంచి వస్తాయనే నమ్మకంలో బీజేపీ అధినేతలున్నారు. అయితే వెంకయ్యనాయుడిపై మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకంగానే ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయగా ముఖ్యమంత్రి ఎదురుదాడి చేశారు.

వెంకయ్యనాయుడి మనవళ్లు ఏ మీడియంలో చదివారు?
చంద్రబాబునాయుడు కొడుకు లోకేష్ ఏ మీడియంలో చదివారు? వెంకయ్యనాయుడి మనవళ్లు ఏ మీడియంలో చదివారంటూ రాష్ట్ర రాజకీయాలతో సంబంధంలేని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వెంకయ్యపై జగన్ నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు.

జగన్ బెట్టు చేస్తారా?
బీజేపీ అధిష్టానం ఒకవేళ వెంకయ్యనాయుడి పేరు ప్రతిపాదించినా వైఎస్ జగన్ బెట్టు చేసే అవకాశం ఉందని, రాష్ట్రంలో తనకు రాజకీయంగా సమీకరణాలేమైనా కలిసివస్తాయనుకుంటేనే మద్దతిస్తారని లేదంటే బీజేపీ పెద్దలపై ఒత్తిడిచేసి వేరేపేరు ప్రతిపాదించేలా కూడా చేయగలిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications