ప్రశ్నిస్తే కేసులు పెడతారా?ఇది అరాచకపు పాలన కాదా?వైసీపి ప్రభుత్వాన్ని కడిగేసిన లోకేష్.!
అమరావతి/హైదరాబాద్ : బిల్లులు చెల్లించాలని పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనమంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రకృతి వైపరీత్యాల వలన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్యం, ధాన్యం బకాయిలు, పంట నష్ట పరిహారం రాకపోవడం, రైతుకి ఉపయోగం లేని ఆర్బికే సెంటర్ల కారణంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు. బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో చెరకు రైతులు నష్టాల్లో కూరుకుపోయారని, విజయనగరంలోని ఎన్సిఎస్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రెండు వేల మంది చెరకు రైతులకు రెండు సీజన్ల బకాయి బిల్లులు 17 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని, బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో చక్కెర కర్మాగారం వద్ద రైతులు ఆందోళన చేపట్టారని లేఖలో లోకేష్ పేర్కొన్నారు.
అసమర్ధ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ గళమెత్తిన రైతులపై ఉక్కుపాదం మోపుతున్నారని వైసీపి ప్రభుత్వంపై లోకేష్ నిప్పులు చెరిగారు. రైతులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? ఇప్పుడు రైతులను మరింత మానసిక క్షోభకి గురిచేస్తూ బొబ్బిలి, సీతానగరం మండలాల్లో 80 మంది రైతులకు నోటీసులు అందజేయడాన్ని లోకేష్ తప్పుబట్టారు. కష్టపడి పండించిన చెరకును చక్కెర పరిశ్రమకు తరలిస్తే రైతులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోకుండా, బిల్లుల కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు లోకేష్. తీవ్ర సంక్షోభంలో ఉన్న చెరకు రైతులను ఆదుకోవడం మాని ప్రభుత్వమే వారిపై వేధింపులకు దిగడం ప్రభుత్వ అహంకార ధోరణికి పరాకాష్ట అని అన్నారు. రైతులకు నోటీసులు పంపి ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తేసి బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని లేఖలో లోకేష్ వైసిపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.