ఏపీపై ఉరుముతున్న కేంద్రం-దేనికి సంకేతం-చంద్రబాబును గుర్తుచేస్తూ జగన్ కు హెచ్చరికలా ?
ఏపీలో జగన్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం వరుస షాకులిస్తోంది. పోలవరం నుంచి మొదలుపెట్టిన ఏపీ ఆర్ధిక పరిస్ధితి, అప్పులు ఇలా ప్రతీ విషయంలోనూ కెలుకుతోంది. చివరికి తాజాగా ఏపీ నుంచి బియ్యం సేకరణ నిలిపేయాల్సి వస్తుందంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన హెచ్చరికలు చూస్తుంటే పరిస్దితులు ఎలాంటి మలుపులు తీసుకుంటున్నాయో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు గతంలో బీజేపీ ఇచ్చిన ట్రీట్ మెంట్ ఇప్పుడు జగన్ విషయంలోనూ అమలు చేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

జగన్ పై ఉరుముతున్న కేంద్రం
ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో ఇన్నాళ్లూ సత్సంబంధాలు కొనసాగిస్తుున్నట్లు కనిపించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రూటు మార్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి పదవికి ఎన్డీయే నిలబెట్టిన అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు మద్దతివ్వడంతో పాటు ఇప్పటికీ తాను కేంద్రానికి అండగా ఉంటున్నట్లు నిరూపించుకంటుున్నప్పటికీ కేంద్రం మాత్రం ఎందుకో ఉరుముతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే కారణంతోనో లేక జగన్ తో ప్రస్తుతానికి అవసరం తీరిపోయిందని భావిస్తుందో తెలియదు కానీ కేంద్రం మాత్రం జగన్ సర్కార్ కు ఇస్తున్న షాకులు చూసి వైసీపీ శ్రేణులే నివ్వెరపోతున్నాయి.

పాత గేమ్ మొదలుపెట్టిన బీజేపీ
తమ ఉనికి లేని రాష్ట్రాల్లో, లేదంటే కనీస ప్రభావం చూపే రాష్ట్రాల్లో బీజేపీ ప్రమాదకరమైన ఆటలకు తెరలేపడం గతంలోనూ పలు చోట్ల చూశాం. తమిళనాడులో శశికళ ఉదంతం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే ఏపీలోనూ తమతో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిన చంద్రబాబు విషయంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరించింది. ఓ దశలో కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీని ఏపీకి పంపేందుకు కూడా ప్రయత్నించినా చంద్రబాబు లౌక్యంగా వ్యవహరించి అడ్డుకట్ట వేసేశారు. దీంతో రగిలిపోయిన బీజేపీ.. ఎన్నికల సమయంలో అన్ని వనరుల్ని అడ్డుకుని చంద్రబాబును దెబ్బతీసింది.

చంద్రబాబు గతం జగన్ కు గుర్తుచేస్తోందా ?
గతంలో చంద్రబాబు తమతో విభేదించిన కారణంగా టార్గెట్ చేసి దెబ్బతీసిన కేంద్రం.. ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే గేమ్ మొదలుపెట్టిందా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా ఏపీ ప్రభుత్వానికి కేంద్రం జారీ చేస్తున్న హెచ్చరికలు, ఇస్తున్న షాకులు చూస్తుంటే చంద్రబాబు గతాన్ని గుర్తుచేస్తూ జగన్ పై కేంద్రం గేమ్ స్టార్ట్ చేసినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోవైసీపీ ఎదురుదాడికి దిగుతుందా లేక మరికొన్నాళ్లు వేసి చూసే ధోరణి అవలంబిస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే వైసీపీ ఎదురుదాడికి దిగితే మాత్రం కేంద్ర సంస్ధల్ని జగన్ పైకి ఉసిగొల్పే ప్రమాదం ఉండటంతో ఆయన కూడా ఆచితూచి వ్యవరించవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications