తెలంగాణ: జగన్పై కిరణ్ పైచేయి, కొత్త పార్టీ ఖాయమా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోందా? వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కిరణ్ పైచేయి సాధించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్దికాలంగా కిరణ్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సీమాంధ్ర కాంగ్రెసు నేతల వ్యాఖ్యలు కొత్త పార్టీ వాదనకు బలం చేకూర్చుతున్నాయి.
సోమవారం పలువురు మంత్రులు కిరణ్ కొత్త పార్టీ పెడతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి శతృచర్ల విజయ రామరాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. అయితే, ఆయన మాత్రం తాను టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలోకి వెళ్లడం లేదన్నారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు కూడా టిడిపి వైపు వెళ్తారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, వారు కూడా తాజాగా కిరణ్ పార్టీ పెడతారనే ఆశాభావంతో ఉన్నారట. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన 23వ తేదీలోగా చర్చ ముగుస్తుందని, ఆ తర్వాత కిరణ్ సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో భేటీ అయి కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారట.
కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు సీమాంధ్ర నేతలు, మంత్రుల మాటలను బట్టి 23 వరకు వెయిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేవారు కొందరు వెళ్లినప్పటికి చాలామంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారంటున్నారు. ఆ రెండు పార్టీల్లో టిక్కెట్ అవకాశం రాని వారు కూడా కిరణ్ పార్టీ కోసం నిరీక్షిస్తున్నారని అంటున్నారు.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నో చెప్పారని, ఆయనకు కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని శత్రుచర్ల అన్నారు. ధర్మాన కిరణ్ పార్టీ కోసం నిరీక్షిస్తున్నారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. జగన్ పార్టీలోకి ధర్మాన చేరుతారని కొంతకాలంగా వస్తున్నప్పటికీ.. అదిగో ఇదిగో వరకే సరిపోతుందని, జగన్ నో చెప్పినందువల్ల కొత్త పార్టీ కోసం చూస్తున్నారేమో అంటున్నారు. అయితే, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అపాయింటుమెంట్ను ధర్మాన కోరడం గమనార్హం.
మరోవైపు ఎపిఎన్జీవోల ఎన్నికలలో వైయస్ జగన్ పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్షంగానైనా పైచేయి సాధించారంటున్నారు. ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబును ఓడించేందుకు జగన్ ఎన్జీవో ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గాన్ని ఉపయోగించుకున్నా అది సఫలం కాలేదంటున్నారు. సమైక్య ఉద్యమంలో ఎపిఎన్జీవో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఎపిఎన్జీవోను తన చేతుల్లో ఉంచుకోవాలని జగన్ భావించారని, అశోక్ బాబు ససేమీరా అనడంతో ఎన్నికల్లో అశోక్ ప్యానల్ను ఓడించాలని చూశారంటున్నారు.
అశోక్ బాబు ముఖ్యమంత్రికి సానుకూలంగా ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. తెలంగాణ ప్రాంత నేతలు కూడా అశోక్ వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని ఆరోపించారు. ఇప్పుడు అశోక్ బాబు ఎపిఎన్జీవో ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా కిరణ్ పైచేయి సాధించారంటున్నారు. కిరణ్ కొత్త పార్టీ పెడితే అశోక్ బాబు పాత్ర ఏమిటనే దాని పైన ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కాగా, కొత్త పార్టీ పెడతారనే వార్తలను కిరణ్ ఖండిస్తూ వస్తున్నారు కూడా.