పవన్ కళ్యాణ్ మద్దతును ఆహ్వానిస్తాం: వెంకయ్య
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీకి మద్దతు ఇస్తామంటే ఆహ్వానిస్తామని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తమ పార్టీది తప్పు లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.
తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. విభజన జరగాలని తాము కోరుకున్నామని, అయితే విభజన జరిగిన తీరు సిగ్గుచేటుగా ఉందని అన్నారు. తాము బిసీలకు ప్రాధాన్యం ఇస్తామని వెంకయ్య నాయుడు చెప్పారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చోద్యం చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు
కాంగ్రెసు నాయకుడు లేని పార్టీ అని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని కాకుండా ఏ శక్తి కూడా అడ్డుకోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీపై కేజ్రీవాల్తో పాటు ఎవరైనా పోటీ చేయవచ్చునని ఆయన అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సీమాంధ్ర అభివృద్దికి కావాల్సిన అన్ని వనరులూ ఉన్నాయని ఆయన కార్యకర్తల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు కేవలం ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేసిందని ఆయన ఆరోపించారు. ముస్లింల ఓటు బ్యాంకు తమ వైపే ఉందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ సహా ఎవరు వచ్చినా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. కాంగ్రెసు మినహా మిగతా ఏ పార్టీతోనైనా తాము పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.