కిరణ్ వస్తారో లేదో అడగండి!: ఫోన్ చేసి అధిష్టానం ఆరా
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం జరగనున్న సమన్వయ కమిటీ భేటీకి వస్తారో, రారో కనుక్కోవాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే.
విభజన నిర్ణయం, ఈ నెల 7న మంత్రుల బృందం (జివోఎం) మరోసారి భేటీ కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి అధిష్టానం నుండి పిలుపు రావడం గమనార్హం. ఎల్లుండి ఎపి కాంగ్రెసు పార్టీ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర సమన్వయ కమిటీ భేటీలో పాల్గొనేందుకు ఆయనకు పిలుపు వచ్చింది.
అయితే కిరణ్ రాక పైన అధిష్టానం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ముఖ్య నేతకు ఫోన్ చేసి భేటికి కిరణ్ వస్తారా లేదా కనుక్కోవాలని అడిగిందట.
గతంలో కిరణ్కు ఢిల్లీ పెద్దలు ఫోన్ చేసి ఢిల్లీకి రమ్మన్నప్పుడు ఆయన తిరస్కరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విభజన నిర్ణయం అనంతరం కిరణ్ సమైక్యవాదం బలంగా వినిపించారు.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పెద్దలు ఫోన్ చేసి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరారు. అయితే తాను ఢిల్లీ వచ్చినా, ఇక్కడ నుండి చెప్పినా, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి చెప్పినా సమైక్యవాదమే వినిపిస్తానని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు కిరణ్ ఢిల్లీ వస్తారా అనే అనుమానాలు అధిష్టానంలో ఉన్నాయంటున్నారు.