జగన్కు బాబు 'భారీ' షాక్ అదేనా? టిడిపి-బిజెపి మధ్య పెరుగుతున్న దూరం
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పైన తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం దుమ్మెత్తి పోశారు. టిడిపి నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని ఘంటాపథంగా చెబుతున్నారు.
ఏపీ మంత్రుల నుంచి టిడిపి నేతల వరకు ఆందరూ ఒకటే చెబుతున్నారు. వైసిపి నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు వైసిపిలో చేరడం ఖాయమని చెబుతున్నారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస రావు, రావెల కిషోర్ బాబు, హోంమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే బోండా ఉమ, టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి తదితరులు ఆదివారం చేరికల పైన మాట్లాడారు.
మరో ఇరవై మంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడం ఖాయమని చెప్పారు. జగన్ వైఖరి నచ్చకే వారు పార్టీని వీడుతున్నారని చెప్పారు. ఆనం వివేకానంద రెడ్డి మరో అడుగు ముందుకేసి... వైసిపి టిడిపిలో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు.
ఇప్పటికే వైసిపి నుంచి డజను మందికి పైగా ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. మరో ఇద్దరు క్యూలో ఉన్నారు. ఇంకో ఇరవై మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని చెబుతున్నారు. దాదాపు నలభై మంది ఎమ్మెల్యేల వరకు టిడిపిలో చేరడం ఖాయమని అంటున్నారు. ఆ తర్వాత వైసిపి టిడిపిలో విలీనం కావడమే అని ఆనం అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యేల చేరిక విషయంలో వైసిపికి టిడిపి ధీటుగానే స్పందిస్తోంది. వైయస్ హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించారని, అప్పుడు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. జగన్ కూడా చేర్చుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు తెరాసలో చేరితే మూడో ఎమ్మెల్యేను అప్పగించారని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే బోండా ఉమ మరో ముఖ్యమైన పాయింట్ లాగారు. రాజ్ భవన్ ఎదుట, మీడియా సాక్షిగా.. జగన్ తమ ప్రభుత్వాన్ని పడగొడతానని సవాల్ చేశారని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతానని ఎలా చెప్పారని, అంటే ఆయన కూడా ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారా అని అభిప్రాయపడ్డారు.
తాము మాత్రం ఎమ్మెల్యేలను కొనడం లేదని, అభివృద్ధిని చూసి చేరుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. తమకు పూర్తి మెజార్టీ ఉండగానే జగన్ ప్రభుత్వాన్ని పడగొడతానని చెప్పారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
మరోవైపు, స్వయంగా జగన్కు కూడా ఎమ్మెల్యేలు వరుస కడతారనే విషయం అర్థమైనట్లుగా ఉంది. అందుకే మరో నలుగురైదుగురు వెళ్తారని పార్టీ అధ్యక్షులే స్వయంగా చెప్పడం గమనార్హం.
టిడిపి-బిజెపి మధ్య పెరుగుతున్న దూరం
ఏపీలో మిత్రపక్షాలైన టిడిపి - బిజెపి మధ్య దూరం పెరుగుతోంది. ఓ వైపు తమ రెండు పార్టీల మధ్య సంబంధం బాగానే ఉందని కొందరు నేతలు చెబుతున్నప్పటికీ.. కొందరు నేతల వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం అలా కనిపించడం లేదు.
బిజెపి నుంచి పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలు చంద్రబాబుపై విమర్శలు చేస్తుంటే టిడిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. శనివారం పురంధేశ్వరి చంద్రబాబుపై నిప్పులు చెరగగా.. మంత్రి గంటా శ్రీనివాస రావు ఘాటుగా స్పందించారు. బిజెపి - టిడిపి మధ్య దోస్తీ ఎంతోకాలం ఉండకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.