వైసీపీ, టీడీపీ మధ్య 2024 అజెండా పోరు-డిసైడ్ చేయబోతున్న ఏపీ అసెంబ్లీ ? టర్నింగ్ పాయింట్!
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ దానికి సరైన ముగింపు ఇవ్వడంలో మాత్రం విఫలమవుతోంది. అదే సమయంలో అమరావతిని సైతం ఏకైక రాజధానిగా అంగీకరించడం లేదు. దీంతో టీడీపీ కూడా అమరావతి రైతులతో కలిసి న్యాయపోరాటం, వీధిపోరాటాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో 2024 ఎన్నికల అజెండా నిర్ణయానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఈసారి ఏపీ అసెంబ్లీ భేటీ వేదిక కాబోతోంది.
అమరావతి వర్సెస్ మూడు రాజధానులు
అమరావతి స్ధానంలో తెరపైకి వచ్చిన మూడు రాజధానులు అమల్లోకి వస్తాయా రావా అన్న చర్చ గత మూడేళ్లుగా సాగుతూనే ఉంది. తమ ప్రాంతానికి రాజధానులు వచ్చాయన్న సంతోషం విశాఖ, కర్నూలు వాసుల్లో కనిపించడం లేదు. అదే సమయంలో అమరావతి జనం మాత్రం రాజధాని పోతోందన్న బాధలో ఉన్నారు.
దీంతో రాష్ట్రంలో రాజధాని వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అమరావతి పేరుతో చంద్రబాబు జనాల్ని మోసం చేశారంటూ వైసీపీ, మూడు రాజధానుల పేరుతో వైసీపీ మోసం చేస్తుందంటూ టీడీపీ చేసుకుంటున్న పరస్పర విమర్శలు కూడా జనానికి వెగటు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత కూడా ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం విమర్శలకు తావిస్తోంది.
అమరావతి పాదయాత్ర
వైసీపీ ప్రభుత్వం ఎలాగో మూడు రాజధానులపై ముందుకెళ్లే అవకాశాలు ఇప్పట్లో లేవని భావిస్తున్న అమరావతి రైతులు మరోసారి పోరుకు సిద్ధమయ్యారు. ఇవాళ అరసవిల్లికి రెండోదశ పాదయాత్రను ప్రారంభించారు.తద్వారా రాజధానిపై ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి విపక్షాలన్నీ మూకుమ్మడిగా మద్దతిస్తుండటంతో జనంలోనూ ఈ పాదయాత్ర చర్చనీయాంశంగామారుతోంది.
ముఖ్యంగా అమరావతిలో ఇవాళ మొదలైన ఈ పాదయాత్ర రాబోయే మూడునెలల్లో అరసవిల్లికి చేరే లోపు ఏదైనా జరగొచ్చనే చర్చ జరుగుతోంది. ఇందులో కేంద్రం వ్యవహారశైలి, విపక్షాల మద్దతు, వైసీపీ ఎదురుదాడి, అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు వంటి ఎన్నో అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి.
అసెంబ్లీలో రాజధానుల బిల్లు
ఇదే క్రమంలో అమరావతి పాదయాత్రపై జనంలో ఎక్కువగా చర్చ జరగకుండా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో మరోసారి మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో రెండుసార్లు ప్రవేశపెట్టి ఆమోదించుకుని, ఓసారి ఉపసంహరించుకున్న ఈ బిల్లును మరోసారి మార్పులతో తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలుచేస్తోంది.
దీంతో ఈసారి బిల్లులో సాంకేతిక అంశాల్నిసరిదిద్ది ప్రవేశపెడుతున్నారా లేక యథాతథంగా ప్రవేశపెడతారా అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి పాదయాత్రపై చర్చ జరగకుండా మూడు రాజధానులపై చర్చ జరిగేలా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
2024 ఎన్నికల అజెండా డిసైడర్?
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే మూడు రాజధానుల బిల్లు కచ్చితంగా 2024 ఎన్నికల అజెండాకు నిర్ణయాత్మకంగా మారబోతోంది. ఎందుకంటే ఇప్పటివరకూ 2024 ఎన్నికల్లో సంక్షేమంపై చర్చ జరిగితే తాము సులువుగా విజయం సాధిస్తామని అంచనా వేసుకున్న ప్రభుత్వానికి రాజధానుల వ్యవహారం తలబొప్పి కట్టిస్తోంది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టే బిల్లు సాంకేతికంగా పక్కాగా ఉంటే దీనిపై భవిష్యత్తులోనూ ప్రత్యర్ధులు సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఇబ్బందులు ఉండవు. అప్పుడు రాజధానుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేస్తుంది.అలా కాకుండా మళ్లీ హడావిడిగా బిల్లు పెట్టి పంతం నెగ్గించుకుందామని ప్రయత్నిస్తే మాత్రం హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ వైసీపీ సర్కార్ కు ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు.అప్పుడు ఏకంగా 2024 ఎన్నికల అజెండా కూడా రాజధానులుగా మారిపోవడం ఖాయం.