కోటి ఇస్తే ప్రాణాలు తిరిగొస్తాయా...ప్రభుత్వాన్ని జాతీయ మీడియా ఉతికారేసింది: చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం విచారణ తూతూ మంత్రంగా మాత్రమే చేస్తోందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. తాత్కాలికంగా ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడొచ్చు.. కానీ దీర్ఘకాలంలో దీని ప్రభావమేంటి అనేదానిపై స్టడీ చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. గ్యాస్ తీవ్రత ఆ స్థాయిలో లేకుంటే పశువులు ఎలా చనిపోయాయని, చెట్లు ఎలా మాడిపోయాయని చంద్రబాబు ప్రశ్నించారు.
Recommended Video
ముఖ్యమంత్రిగా పదిమందితో మాట్లాడాలని చెప్పిన చంద్రబాబు రూ. కోటి ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. అసలు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఎవరైనా జగన్ను అడిగారా అని ప్రశ్నించారు చంద్రబాబు. హుదుద్ తుఫాన్ విశాఖను కుదిపేసినప్పుడు తాను ముఖ్యమంత్రిగా 9 రోజులు అక్కడే ఉన్నట్లు చెప్పారు చంద్రబాబు.
ఈ ఘటనకు బాధ్యులు ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పిన చంద్రబాబు.. ప్రభుత్వాలు ఏమీ చేయలేనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించాలని చెప్పారు. వీటివల్ల న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ను ఆశ్రయించొచ్చని చెప్పారు. ఇక ఇండస్ట్రీస్కు తాను వ్యతిరేకం కాదని చెప్పిన చంద్రబాబు సేఫ్టీ కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
జగన్ ప్రభుత్వాన్ని జాతీయ మీడియా ఉతికి ఆరేసిందని చంద్రబాబు చెప్పారు. రాజకీయ పార్టీలను, అధికారులను ప్రజలను జగన్ సర్కార్ ఇబ్బందులకు గురిచేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు వారికి అండగా నిలబడాల్సిన అవసరం తమపై ఉందని వెల్లడించారు.
సీఎం జగన్కు అవగాహన లేదు: ఆయన మనస్తత్వం అలాంటిది: చంద్రబాబు ఫైర్
ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పిన చంద్రబాబు.. ముందుగా ఎయిర్ క్వాలిటీపై పరీక్షలు చేయాలని చంద్రబాబు చెప్పారు. గాల్లో గ్యాస్ తీవ్రత ఏంటనేది కూడా అనలైజ్ చేయాలని అదే సమయంలో స్టైరీన్ గ్యాస్ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది విశ్లేషించాలని ఇందుకోసం పలువురు నిపుణుల నుంచి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేయాలని చెప్పారు. మన రాష్ట్రంలో ఉండే విషయపరిజ్ఞానం పరిమితి స్థాయిలో మాత్రమే ఉందని చెప్పిన చంద్రబాబు కేంద్రం నుంచి కూడా సలహాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
ఇక కరోనావైరస్ ఎంత ప్రమాదకరమో మొదటి రోజునుంచి చెబుతున్నప్పటికీ జగన్ సర్కార్ పట్టించుకోలేదని పారాసిటామల్ టాబ్లెట్తో సరిపోతుందని నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు చంద్రబాబు. అందుకే ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఇక గ్యాస్ లీకేజీ ఘటనపై కూడా అదే ఉదాసీనతతో వ్యవహరించిందని మండిపడ్డారు. ఇది తమ కార్యకర్తలు చేశారని వైసీపీ చెప్పడం అత్యంత హేయమైన చర్య అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రమాదం జరిగిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు చంద్రబాబు.