బాబుకు జూ.ఎన్టీఆర్ ఇప్పటికే దూరం! పవన్ కళ్యాణ్ వస్తారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హైదరాబాదులోని గండిపేటలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతారా? ఇప్పుడు పలువురి మదిలో మెదలుతున్న ప్రశ్న ఇది. పవన్కు ఆహ్వానం అందిందని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆయన మహానాడుకు హాజరవుతారా? అనే చర్చ సాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. ఆ పార్టీల తరఫున జోరుగా ప్రచారం చేశారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలోను పదిహేను సీట్లలో గెలిచింది.
సార్వత్రిక ఎన్నికల సమయం నుండి పవన్ కళ్యాణ్ బీజేపీ-టీడీపీలకు మిత్రుడిగా మారారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధానికి చెందిన భూమి విషయంలో ఆయన తరుచూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రైతుల నుండి భూమిని బలవంతంగా తీసుకోవద్దని, వారు అంగీకరిస్తేనే తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్కు మహానాడుకు ఆహ్వానం అందిందనే వార్తలు వచ్చాయి. ఈ రోజుతో మహానాడు రెండు రోజులు పూర్తవుతుంది. మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. 2009లో జోరుగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీకీ దూరమయ్యారనే చెప్పవచ్చు.
దీంతో, ఆయన మహానాడుకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అయితే, ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ మహానాడుకు హాజరయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడో రోజైన వస్తారా లేదా అనేది చర్చనీయాంశమవుతోంది.