అనుకున్నదొకటి: ఈక్వేషన్స్ మార్చిన పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకు వచ్చారనే చెప్పవచ్చు. జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా పవన్ జనసేన ప్రభావం మాత్రం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉంటుంది. సీమాంధ్ర, తెలంగాణ ఇరు ప్రాంతాల్లోను పవన్ ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పవన్ పార్టీని ప్రకటించి రాజకీయ సమీకరణాలను మార్చివేశారు.
పవన్ రాజకీయ పార్టీని స్థాపించక ముందు ఊహించింది ఒకటి కాగా, పార్టీ ప్రకటన.. ఆ తర్వాత జరుగుతుంది అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. పవన్ పార్టీ పెడతారనే ప్రచారం జరిగినప్పుడు టిడిపికి నష్టమని అందరు లెక్కలు వేశారు. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి టిడిపిని దెబ్బతీసినట్లు ఇప్పుడు పవన్ సిద్ధమయ్యారని జోరుగా ప్రచారం సాగింది. అయితే, పవన్ రెండు గంటల ప్రసంగం ద్వారా ఆయన టార్గెట్ ఏమిటో స్పష్టంగా తెలిసిపోయింది.

తదనంతర పరిణామాల ద్వారా పవన్ టార్గెట్... రెండు ప్రాంతాల్లో కాంగ్రెసు, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆయన టార్గెట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ తన కొత్త పార్టీ ద్వారా తన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి కూడా సవాల్ విసిరారనే చెప్పవచ్చు. చిరంజీవి సీమాంధ్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు. పవన్ మాత్రం కాంగ్రెసు పార్టీని ఒక్క స్థానంలో కూడా గెలిపించవద్దని కంకణం కట్టుకున్నారు.
విభజన నేపథ్యంలో సీమాంధ్రలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్యనే పోటా పోటీ ఉంటుందని, కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీని బలోపేతం చేసేందుకు చిరంజీవి సహా, ఇతర సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్న సమయంలో పవన్ ఆరంగేట్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. పవన్ టిడిపి, బిజెపిలతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు. పవన్ ప్రభావం సీమాంధ్రలో జగన్ పార్టీ పైన, తెలంగాణలో తెరాస పైన కచ్చితంగా ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications