Amaravati: పొమ్మన్న సింగపూర్ మళ్లీ అమరావతికి వస్తుందా? గతంలో ఏం జరిగింది?
ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిపై వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా నిన్న జరిగిన సీఆర్డీయే భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానమైనది గతంలో నిర్ణయించిన అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన మార్పుల్ని సరిదిద్ది అప్పటి ప్లాన్ ను యథాతథంగా అమలు చేయడం, ఇందులో సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి మరోసారి సింగపూర్ ప్రభుత్వ సాయం తీసుకోవాలని నిర్ణయించడం వంటి నిర్ణయాలున్నాయి. అయితే ఇప్పుడు సింగపూర్ తిరిగి అమరావతికి వస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం..
2014-19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీ ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అనంతరం 2016లో సింగపూర్ ప్రభుత్వ సాయంతో కొన్ని సంస్ధలు కన్సార్టియంగా ఏర్పడి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ ఇవ్వడంతో పాటు సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి ముందుకొచ్చాయి. దీనికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహం లభించడంతో వేగంగా పనులు ముందుకు సాగాయి. అయితే 2018 తర్వాత పరిస్దితి మారుతూ వచ్చింది. 2019 నాటికి చంద్రబాబు అధికారం కోల్పోవడంతో సింగపూర్ కన్సార్టియం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దీనికి కారణం ఆ తర్వాత ఏర్పడిన వైసీపీ సర్కారే.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ ఆరు నెలల్లోనే అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది. అంతే కాదు సింగపూర్ తో గత చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసేసింది. దీంతో సింగపూర్ కూడా చేసేది లేక వెనక్కి తగ్గింది. అప్పట్లో చంద్రబాబు సర్కార్ తో సన్నిహితంగా మెలిగి, రాజధాని ఒప్పందాల్లో కీలకంగా వ్యవహరించిన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా ఆ తర్వాత అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని తెరమరుగయ్యారు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వ సాయంతో తిరిగి సీడ్ క్యాపిటల్ అభివృద్ధి చేయాలని నిన్నటి సీఆర్డీయే సమావేశంలో నిర్ణయించింది. అయితే ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో తప్పుకోవడం, ఏపీలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారిపోతున్న నేపథ్యంలో మరోసారి సింగపూర్ అమరావతిలో రీఎంట్రీ ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వారిని ఎలా ఒప్పిస్తుందన్న చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications