ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరి వైపు- రిఫరెండం రెడీ: బరిలో చంద్రబాబు అభ్యర్ధి..!!
ఉత్తరాంధ్ర ప్రజలు మూడు రాజధానులకు అనుకూలమా -వ్యతిరేకమా. ఏ పార్టీ వైపు ఆ మూడు జిల్లాల ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటికీ సమాధానం రాబోతోంది. ఏపీలో ఇప్పుడు మొత్తం రాజకీయం మూడు రాజధానుల చుట్టూ తిరుగుతోంది. అమరావతి మహా పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశిస్తున్న వేళ..అక్కడ రాజకీయం వేడెక్కింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు - వైసీపీ నేతలు పాదయాత్ర పైన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పాదయాత్ర వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపిస్తున్నారు. పాదయాత్ర అడ్డుకుంటామని కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల పల్స్ తేలిపోనుందా
ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలనే డిమాండ్ తో అవసరమైతే రాజీనామాకు సిద్దమంటూ మంత్రులు ముందుకు వస్తున్నారు. విశాఖతో పాటుగా ఉత్తరాంధ్రలో రాజకీయంగా పట్టు కొనసాగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో టీడీపీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల మూడ్ ఏవిధంగా ఉందనేది..ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.
ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయం ఎవరికి అనుకూలంగా ఉందనే అంశం తేలిపోనుంది. మరి కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్ధిని ప్రకటించారు. సీతంరాజు సుధాకర్ ను వైసీపీ బలపర్చుతూ నిర్ణయం తీసుకుంది.

మూడు రాజధానుల పై రిఫరెండంగా
ఆయన గెలుపు కోసం ఓటర్ల రిజిస్ట్రేషన్ నుంచి గెలుపు వరకూ పార్టీ నేతలు బాధ్యతలు తీసుకున్నారు. అటు పీడీఎఫ్ అభ్యర్ధిగా కె.రమాప్రభ బరిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా, టీడీపీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. లక్ష్మి ప్రస్తుతం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 2వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు.
2008-10లో భీమిలి మున్సిపల్ చైర్పర్సన్గా వ్యవహరించిన చిన్నికుమారి లక్ష్మి.. రాష్ట్ర తెలుగు మహిళా విభాగంలో పని చేశారు. నాగవంశీయుల(బీసీ) వర్గానికి చెందిన చిన్నికుమారి భర్త అప్పల నాయుడు 1986నుంచి టీడీపీలో ఉన్నారు. అటు విశాఖ పరిపాలనా రాజధాని చేయాలంటూ జేఏసీ ఏర్పాటు అయింది. కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయించింది.

సార్వత్రిక ఎన్నికలకు ముందే ఫలితం
అటు సుప్రీం కోర్టులో మూడు రాజధానుల వ్యవహరం పెండింగ్ లో ఉంది. మరో 18 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. విశాఖ పరిపాలనా రాజధాని నినాదం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య ప్రధన అంశంగా మారుతోంది. దీంతో విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకొనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖ పరిపాలనా రాజధాని వ్యవహారం పైన ఒక విధంగా రిఫరెండంగా మారనుంది.
ప్రధాన పార్టీలు మద్దతిస్తున్న అభ్యర్ధులు బరిలో నిలవటంతో..ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. విశాఖ కేంద్రంగా వైసీపీ తమ వ్యూహాలకు పదును పెడుతూ..ముందడుగు వేస్తున్న సమయంలో టీడీపీ మౌనం పాటిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు ఎవరికనే అంశం పైన క్లారిటీ రానుంది. దీంతో..విశాఖ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి కరంగా మారాయి.












Click it and Unblock the Notifications