‘మీ ప్రభుత్వంపై మీరే కోర్టుకా.. సిగ్గు చేటు’: బాబుపై నిప్పులు చెరిగిన రాంబాబు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నానికి దిగారని అన్నారు.
'విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని, ఇది సిగ్గు చేటు..' అని రాంబాబు వ్యాఖ్యానించారు. నిజంగా న్యాయస్థానాలకు వెళ్లాలనుకుంటే బాబు బీజేపీతో భాగస్వామ్యం వదులుకోవాలని డిమాండ్ చేశారు.

'మీ ప్రభుత్వంపై మీరే కోర్టులకు వెళ్తారా? ఇది ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు..' అని అంబటి ఎద్దేవా చేశారు. విభజన చట్టాల హామీలు అమలు చేయాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని, కేంద్ర, రాష్ట్రాల మీదే ఆ బాధ్యత ఉందని అన్నారు.
ప్రత్యేక హోదా ప్రతిపాదన వస్తే.. అప్పుడు మేం ఆలోచన చేస్తామని నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారని, ఆయన మాటలు వింటుంటే.. అసలు చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని అర్థమవుతోందన్నారు.
జాతీయ సగటు ఆదాయం కంటే ఏపీ ప్రజల సగటు ఆదాయం ఎక్కువగా ఉందని చెబుతున్నారని, జీడీపీ పెంచి చూపిస్తున్నారని, అప్పులు తెచ్చుకునేందుకే చంద్రబాబు అలా చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలా ఆదాయం ఎక్కువ చేసి చూపడం వల్ల రాష్ట్ర ప్రజానీకానికే తీవ్ర నష్టం కలుగుతుందని రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications