టిడిపితో ముచ్చెమటలు, వైయస్ ఫ్యామిలికీ ప్రతిష్ట: జగన్ అప్రమత్తం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీన సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీన సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు.
17వ తేదీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగే పోలింగులో ఓటు హక్కు వినియోగించుకుంటారు. అదే రోజు హైదరాబాద్ వెళ్తారు. కాగా, రాష్ట్రంలో తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరు స్థానాల్లో టిడిపి ఏకగ్రీవం చేసుకుంది. కడప, కర్నూలు, నెల్లూరులలో వైసిపి పోటీ చేస్తోంది.
'సత్య నాదెళ్లను చంద్రబాబే సీఈవో చేశారు, కానీ మైక్రోసాఫ్ట్ షాకిచ్చింది'
నెల్లూరు, కడప, కర్నూలలో బలం కారణంగా గెలుస్తామని వైసిపి ధీమా వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో టిడిపి క్రాస్ ఓటింగు, తమ పార్టీలో చేరిన వారి పైన నమ్మకం పెట్టుకుంది. కర్నూలు, నెల్లూరులను పక్కన పెడితే.. కడప జిల్లా వైయస్ జగన్కు చాలా కీలకం.
జగన్, ఫ్యామిలికీ ప్రతిష్ట
కడప జిల్లాలో పలువురు సైకిల్ ఎక్కారు. కొందరు తిరిగి వైసిపిలో చేరినప్పటికీ.. టీడీపీ గెలుపు పైన ధీమాగా ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే గెలవలేడని, అలా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఇప్పుడు కడప ఎన్నికలు జగన్కు కీలకం. మరో విషయం.. ఆయన తన బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని పోటీలోకి దింపారు. కడప అంటేనే వైయస్ కుటుంబం ప్రతిష్ట.. ఇప్పుడు వైయస్ వివేకా బరిలో ఉండటంతో.. ఇది ఆ కుటుంబానికి మరింత ప్రతిష్టగా మారింది.
జగన్కు ఇబ్బందికరమేనా?
కడప వైయస్ ఫ్యామిలీకి కంచుకోట. వైయస్ ఉన్న సమయంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వారి కుటుంబమే అన్ని స్థానాలను గెలుచుకునేది. కానీ ఇప్పుడు కాలం మారింది. జగన్ రాజకీయం నడుపుతున్నారు. ఈ తరుణంలో సొంత జిల్లాలో కూడా ఆయనకి గెలుపు అంత సులభం కాదన్నట్లుగా తయారయిందని అంటున్నారు.
రంగంలో వైయస్ వివేకా
సొంత జిల్లాలో సైతం జగన్కి పొలిటికల్ గ్లామర్ తగ్గినట్టే కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ పోరులో వైయస్ వివేకాను జగన్ బరిలోకి దింపారు. ఈ ఎన్నికలను టిడిపి కూడా సవాల్గా తీసుకుంది. పులివెందుల ప్రాంతానికి చెందిన బీటెక్ రవిని తన అభ్యర్థిగా పోటీకి నిలిపింది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం రెండు పార్టీల అధినేతలు రంగంలోకి దిగడంతో కడప రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
జగన్ కుటుంబ సభ్యుడిని ఓడించేనా?
గెలుపే ప్రధానంగా ఇరు పక్షాలు పావులు కదుపుతున్నాయి. జగన్ కుటుంబ సభ్యుడిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది గమనించిన జగన్.. అప్రమత్తయ్యారు. సొంత జిల్లాలో తమ కుటుంబ సభ్యుడు ఓడిపోతే తమ పరువుకు భంగం వాటిల్లుతుందన్న భావన ఆయన్ని వెంటాడుతోంది. అందుకే ఆయన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
క్యాంపు రాజకీయాలు
పోటీ పతాకస్థాయికి చేరడంతో కడప జిల్లాలో క్యాంపు రాజకీయానికి తెర లేచింది. ఏ పార్టీకి ఆ పార్టీ వారు తమ పార్టీ ఓటర్లను శిబిరాలకు తరలించినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 841 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల క్యాంపులలో ఒక్కోక్కరి వద్ద 400 మంది చొప్పున ఓటర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.
టిడిపిలో ఉన్న వారిపై వైసిపి ఆశలు
మిగిలిన సుమారు నలభై మంది ఓటర్లు తమ క్యాంపులలో ఉన్నారని ఓ పక్షం, లేదు తమ వైపు ఉన్నారని మరో వర్గం వాదిస్తోంది. అయితే, వైసిపి నేతలు తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. టిడిపి క్యాంపులో ఉన్న వారిలో 60 నుంచి 70 మంది వైసిపికే క్రాస్ ఓటింగ్ వేస్తారని అంచనా వేస్తున్నారని తెలుస్తోంది. ఆ ఓటర్లు వైయస్ అభిమానులు కావడంతో ఆశలు పెట్టుకున్నారు.
టిడిపి స్పీడుతో వైసిపికి ముచ్చెమటలు!
అయితే, ఒకవేళ ఏదైనా అనుకోని విధంగా జరిగితే పార్టీ పరువు పక్కన పెడితే.. వైయస్ ఫ్యామిలీ పరువు పోతుందని వైసిపి నేతలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. టిడిపి నేతల మాటలు, వారి దూకుడు చూస్తుంటే వైసిపికి చుక్కలు కనిపిస్తున్నాయని, చెమటలు పడుతున్నాయని అంటున్నారు. వైయస్ వివేకా కోసం జగన్ దేనికైనా సిద్ధమంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.