వివాహిత అనుమానాస్పద మృతి: ఆత్మహత్యేనంటున్న కుటుంబసభ్యులు(పిక్చర్స్)
విశాఖపట్నం: నగరంలోని ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనారోగ్యం కారణాంగానే మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నప్పటికీ.. ఆమె మృతదేహం మెడపై గాట్లు ఉండటంతో ఆత్మహత్యా లేదా హత్యా అనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిలపాలెంలోని పీతలవానిపాలేనికి చెందిన కోసూరి రమేష్కు, విజయవాడకు చెందిన చిలికి రామారావు కుమార్తె శ్రీలతతో 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 11ఏళ్ల కుమార్తె, 8ఏళ్ల కుమారుడు ఉన్నారు. రమేష్ ఎల్అండ్ టి కంపెనీ(రాయిచూరు)లో ఉద్యోగం చేస్తుండగా, అతని భార్య శ్రీలత.. పిల్లలతోపాటు అతని తల్లిదండ్రులు పీతలవానిపాలెంలో ఉంటున్నారు.
కాగా, సోమవారం ఉదయం పిల్లలను విశాఖ వేలీ పాఠశాలలో దింపి శ్రీలత తిరిగి ఇంటికి చేరుకుంది. తర్వాత ఏమైందో ఏమోగానీ శ్రీలత మృతి చెందిందంటూ రమేష్, అతని కుటుంబసభ్యులు విజయవాడలోని శ్రీలత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చేవరకూ మృతదేహాన్ని ద్వారకానగర్లోని ఒక ఆస్పత్రిలో భద్రపర్చారు.
ఈ విషయం మీడియా ద్వారా మంగళవారం ఉదయం బయటికి వచ్చింది. దీంతో ఎంవిపి జోన్ ఎస్ఐలు అప్పలనాయుడు, నాగేశ్వరరావు సిబ్బందితో పీతలవానిపాలెంలోని రమేష్ ఇంటికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీలత అస్తమా, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నదని, అనారోగ్యం కారణంగా మృతి చెందిందంటూ ఆమె తల్లిదండ్రులతోపాటు పాటు పోలీసులకు తెలిపాడు.
శ్రీలత కుటుంబసభ్యుల వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత పోలీసులు.. ఆమె మృతదేహాన్ని ఉంచిన ఆస్పత్రికి వెళ్లారు. ఫ్రీజర్లో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా మెడపై తాడు బిగించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. శ్రీలత అత్తింటివారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి గట్టిగా ప్రశ్నించాడు. దీంతో శ్రీలత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.
శ్రీలత ఆత్మహత్య చేసుకుంటే.. అనారోగ్యం వల్లే మరణించిందని ఎందుకు చెప్పారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా, శ్రీలతను అత్తింటివారే హత్య చేసివుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లి పిల్లలను తీసుకొచ్చినప్పుడు శ్రీలత ఆరోగ్యంగానే ఉందని చెబుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం రాయిచూరు నుంచి శ్రీలత భర్త రమేష్ హడావుడిగా ఇంటికి వచ్చారని, ఆ సమయంలో వారింట్లో అరుపులు వినిపించాయని చెప్పారు. ఆ తర్వాత శ్రీలత మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. తాము ప్రశ్నించడంతో అనారోగ్యం చేయడంతో ఆస్పత్రికి తీసుకెళుతున్నామని, తర్వాత కారు సీట్లో కూర్చోబెట్టారని స్థానికులు తెలిపారు.
అక్కడ్నుంచి కేజీహెచ్ ఎదురుగా ఉన్న రమేష్ సోదరి లీలావతికి చెందిన ఆస్పత్రికి తీసుకెళ్లగా బ్రాట్డెడ్ అని నిర్ధారిస్తూ ఒక రశీదు ఇచ్చారు. మధ్యలో ఎన్నో కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా అంతదూరం తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. తన సోదరి ఆస్పత్రిలో ఫ్రీజర్ లేకపోవడంతో ద్వారకానగర్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మృతదేహాన్ని ఉంచామని రమేష్ పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది.
దీనిపై ఎంవిపి జోన్ సిఐ విద్యాసాగర్ను వివరణ కోరగా శ్రీలత భర్త, తల్లిదండ్రులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు అనుమానాస్పద మృతిగా కేసు మోదు చేశామన్నారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కేసును ఆత్మహత్యగా ఆల్టర్ చేస్తామన్నారు. అనుమానాలపై ప్రశ్నించగా.. కుటుంబసభ్యులే అనుమానం లేదంటున్నప్పుడు ఎవరూ ఏమీ చేయలేమని బదులిచ్చారు.