రూపాయి పూచీకత్తు లేకుండా 'పీఎం విద్యాలక్ష్మి' లోన్.. ఇలా అప్లై చేయండి!
దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పీఎం విద్యా లక్ష్మి' పోర్టల్ రికార్డు స్థాయి విజయాలను నమోదు చేస్తోంది. 2025 ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ పోర్టల్, కేవలం ఏడాది కాలంలోనే 3.31 లక్షలకు పైగా విద్యార్థులకు విద్యా రుణాలను మంజూరు చేసి వారి ఉన్నత విద్యా కలలకు ఊపిరి పోసింది.
విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఈ పోర్టల్ ద్వారా మొదటి సంవత్సరంలో మొత్తం 6,51,974 దరఖాస్తులు అందగా, అందులో 3,31,089 రుణాలకు ఆమోదం లభించింది. అంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇద్దరిలో ఒకరికి (సుమారు 50.8 శాతం) రుణం మంజూరైంది. మొత్తం కోర్సు వ్యవధి కోసం ప్రభుత్వం రూ. 35,939.69 కోట్లను మంజూరు చేయగా, కేవలం మొదటి ఏడాది కోర్సు ఫీజుల కోసమే రూ. 7,229.4 కోట్లను విడుదల చేసింది.

సింగిల్ విండో.. సరళమైన ప్రక్రియ
గతంలో విద్యా రుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ పీఎం విద్యా లక్ష్మి పోర్టల్ ఆ కష్టాలను తప్పించింది. కేవలం రెండు పేజీల సరళీకృత దరఖాస్తు ఫార్మాట్తో, సింగిల్-విండో ప్లాట్ఫారమ్గా ఇది పనిచేస్తోంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్, గ్రామీణ మరియు సహకార బ్యాంకులతో కలిపి మొత్తం 72 బ్యాంకుల నెట్వర్క్ ఈ పోర్టల్తో అనుసంధానమై ఉంది. ఫలితంగా, గతంలో వారాల తరబడి పట్టే రుణ మంజూరు సమయం ఇప్పుడు సగటున ఎనిమిది రోజుల కంటే తక్కువకు తగ్గిపోయింది.
తనిఖీలు లేవు.. వడ్డీ రాయితీలు ఉన్నాయి!
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (NIRF)లో అగ్రశ్రేణి సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి తనఖా లేదా హామీదారులు (Collateral-free) లేకుండానే రుణాలు అందిస్తున్నారు. అంతేకాకుండా, వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న కుటుంబాల విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు తీసుకునే రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ప్రయోజనాన్ని ఇతర పథకాల పరిధిలోకి రాని సుమారు లక్ష మంది విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నిరంతర పర్యవేక్షణ
విద్యార్థులకు ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు ఉన్నత విద్యా శాఖ, ఆర్థిక సేవల శాఖ మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) సంయుక్తంగా దరఖాస్తుల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, సేవలను మరింత మెరుగుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎంత రుణం లభిస్తుంది?
విద్యార్థులు తమ కోర్సు ఫీజుల అవసరానికి అనుగుణంగా మూడు విభాగాల్లో రుణం తీసుకోవచ్చు:
- రూ. 4 లక్షల లోపు.
- రూ. 4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు.
- రూ. 7.5 లక్షలకు పైగా.
అర్హతలు ఇవే..
ఈ పథకం కింద కింది కోర్సుల్లో చేరే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు:
- డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ (వైద్యం).
- ఆర్కిటెక్చర్, చార్టర్డ్ అకౌంటెన్సీ (CA), మేనేజ్మెంట్ కోర్సులు.
- ఎంఎస్, ఐఐటీ, విమానయాన (ఏవియేషన్) వంటి వృత్తి విద్యా కోర్సులు.
- భారతదేశంలోనే కాకుండా, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారు కూడా ఈ పథకానికి అర్హులే.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
నమోదు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది:
- ముందుగా 'పీఎం విద్యాలక్ష్మి' అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
- మీ పేరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, చిరునామా వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మీ మార్కుల జాబితా (Marks Memo), చదివిన కోర్సు పత్రాలు, మీరు చేరాలనుకుంటున్న కాలేజీ ప్రవేశపత్రం (Admission Letter) జతచేయాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి గడువు తేదీ లేదు. అయితే, ఒక విద్యార్థికి ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.














Click it and Unblock the Notifications