ఆయనే భర్త, నాతో గడిపాడు: మహిళ, అసభ్య మెసేజ్లంటూ డీఈవో
గుంటూరు: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఓ మహిళ శుక్రవారం హల్చల్ చేసింది. డీఈవో శ్రీనివాసులురెడ్డి తన భర్త అని, తాము సహజీవనం చేశామని తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది.
జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసులరెడ్డి తనను దైవసాక్షిగా పెళ్లాడి, ప్రస్తుతం తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మోసగిస్తున్నారని విజయవాడకు చెందిన వై భవాని ఆందోళనకు దిగింది. శుక్రవారం మధ్యాహ్నం డిఇఓ కార్యాలయానికి చేరుకున్న భవానీ నేరుగా ఆయన ఛాంబర్లోకి వెళ్లటమే కాకుండా బిగ్గరగా కేకలు వేసింది దీంతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
భవానీ డిఇఓ ఛాంబర్ నుంచి బయటకు రాకుండానే అధికారి శ్రీనివాసులరెడ్డితో వాదనకు దిగింది. సిబ్బంది ఎంత ప్రయత్నించినా కూడా అమెను బయటకు పంపలేక పోయారు. కాస్సేపటికి మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. మీడియా ఎదుటకు తనకు అన్యాయం జరిగిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
2009లో విజయవాడలోని ఒక గుడిలో శ్రీనివాసులరెడ్డి తనను వివాహం చేసుకున్నాడని, అయితే సాక్షులు ఎవరూ లేకపోవటంతో మోసం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించింది. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుంది. దీంతో పోలీసులు వచ్చి భవానీని నగరంపాలెం పోలీసుస్టేషన్కు తరలించారు.
అయితే భవానీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, వివాహం అయినట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని డిఇఓ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కాకినాడలో డిప్యూటి డిఇఓగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తన కుటుంబ సభ్యులు మచిలీపట్నంలో ఉండేవారని, ఆ సమయంలో తన కూతురు ఒక ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తుండగా, అదే పాఠశాల ప్రిన్సిపాల్గా భవానీ పనిచేయటం వరకు తెలుసునన్నారు.
అప్పటి నుంచి తరచుగా తనకు ఫోన్ చేస్తుండేదని, అంతకుమించి మరొకటి లేదన్నారు. ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించిన భవానీ అవకతవకలకు పాల్పడటంతో పదవి నుంచి తొలగించినట్లు తనకు తెలుసునన్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఫోన్ ద్వారా మెసెజ్లు పంపుతూ వేధించ సాగిందన్నారు. ఈ మేరకు స్ధానిక పట్ట్భాపురం పోలీసుస్టేషన్లో 5 నెలల కిందట ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అనేక సార్లు సెల్ఫోన్కు అసభ్య మేసేజ్లు పెట్టేదని, ఈ విషయమై అక్కడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డీఈవో వెల్లడించారు. తాను తూర్పుగోదావరి డీఈవోగా బదిలీ అయిన తరువాత కూడా తరచూ ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడేదని వివరించారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం తన చాంబర్లో ఉండగా లోపలికి వచ్చి వివాహం చేసుకోవాలని వాగ్వివాదానికి దిగినట్లు తెలిపారు.
ఇటువంటి చర్యలు తగవంటూ ఎంత చెప్పినా వినకుండా కార్యాలయంలో వస్తువులు ధ్వంసం చేసి ఆందోళనకు దిగినట్లు తెలిపారు. దీంతో నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆమెకు ఇప్పటికే బీటెక్, డాక్టర్ చదివే కొడుకు, కూతురు ఉనట్లు గతంలో పోలీసులు విచారణలో తెలిందని వివరించారు.
మహిళపై కేసు నమోదు
డీఈవో శ్రీనివాసులురెడ్డి తన భర్తేనంటూ హల్చల్ చేసిన భవానీపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖాధికారి ఫిర్యాదు మేరకు బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు, అసభ్యకర మెసేజీలు పంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆమె మానసిక స్థితిపై కూడా విద్యాశాఖాధికారి ఫిర్యాదులో పేర్కొనడంతో మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమె మానసిక స్థితిపై వైద్యపరీక్షలు చేయించనున్నట్లు సీఐ హైమారావు తెలిపారు.