అత్తింటి వేధింపులు: 11 నెలల చంటిబిడ్డతో కాలువలోకి దూకి మహిళ ఆత్మహత్య
అమరావతి: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత తన 11 నెలల చిన్నారితో సహా కాలువలోకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, కండ్రిగకు సమీపంలోని అల్లపల్లివారి పాలెంనకు చెందిన నక్క వెంకటరమణ (20) అనే మహిళకు ఏడాదిన్నర క్రితం వాడపాలేనికి చెందిన నక్కరాజుతో వివాహం జరిగింది.
వీరికి 11 నెలల కుమార్తె ఉంది. ఇటీవల కాలంలో భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో కార్తీక పౌర్ణమికి పుట్టింటికి వచ్చిన వెంకటరమణ శనివారం రాత్రి తన 11 నెలల బిడ్డతో సహా బొబ్బర్లంక, అమలాపురం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆదివారం ఉదయం పలివెల వంతెన సమీపంలో వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తింటి వారి వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని వెంకట రమణ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కమలాపురంలో వివాహిత బలవన్మరణం
వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం పట్టణంలోని బైండ్కాలనీలో ఆదివారం తెల్లవారుజామున రాములు(25) అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. శనివారం రాత్రి భర్తతో గొడవపడిన రాములు గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. భర్తే హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications