ఎందుకిలా?: భర్త సాప్ట్వేర్ ఉద్యోగి.. ఐదంకెల జీతం.. వివాహిత ఆత్మహత్య
అమరావతి: భర్త సాప్ట్వేర్ ఉద్యోగి.. ఐదంకెల జీతం... సాఫీగా సాగిపోతున్న జీవితం అయినా సరే ఇలా ఎందుకు జరిగిందంటూ స్థానికులు ఎంతో విషాదం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో గురువారం సాయంత్రం బుద్ధి ఉదయశ్రీ (29)అనే వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... వేటపాలెం మండలం దేశారుపేట పంచాయతీ రామ్నగర్లోని శాంతినగర్కు చెందిన ఉదయశ్రీకి, చీరాల మండలం జాండ్రపేటకు చెందిన బుద్ధి దుర్గా నాగమల్లేశ్వరరావుతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.
నాగమల్లేశ్వరరావు హైదరాబాద్లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ హైదరాబాద్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరు సంతానం. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది.
గత శనివారం పని నిమిత్తం దుర్గానాగమల్లేశ్వరరావు జాండ్రపేట వచ్చాడు. భార్యకు సమాచారం అందించటంతో ఆమె ఆదివారం ఉదయం పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి జాండ్రపేటకు వెళ్లింది. ఆదివారం రాత్రి నాగమల్లేశ్వరరావు తిరిగి హైదరాబాద్ వెళ్లాడు.
అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉదయశ్రీ అత్తామామలు ఆమె తల్లిదండ్రులకు మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని సమాచారం తెలిపారు. సమాచారం అందుకున్న చీరాల వన్టౌన్ పోలీసులు, డీఎస్పీ ప్రేమ్కాజల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతురాలి తల్లి ఆదిలక్ష్మి మాట్లాడుతూ అత్తామామల వేధింపులే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తోంది. అయితే తాము ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగిందని మృతురాలి అత్తామామలు అంటున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చీరాల వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
భార్య మృతి వార్త విన్న దుర్గా నాగమల్లేశ్వరరావు హుటాహుటిన హైదరాబాద్ నుంచి జాండ్రపేటకు చేరుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాలలోని ఏరియా వైద్యశాలకు తరలించారు.