అమ్మ నువ్వు రాకుంటే నన్ను చంపేస్తారు: కూతురిని అలా చూసి.. ఆ తల్లి గుండె పగిలి..
లక్ష్మి ఏడుస్తూ ఫోన్ చేయడంతో తల్లి వెంకట లక్ష్మమ్మ వెంటనే నరసింహాపురం పరిగెత్తింది.
ప్రొద్దుటూరు: ఏమైందో తెలియదు.. అంతకు పది నిముషాల ముందే తమ్ముడితో క్షేమ సమాచారాల గురించి ఫోన్ లో మాట్లాడింది. ఆపై ఉన్నట్టుండి అమ్మకు ఫోన్ చేసి తనను చిత్రవధకు గురిచేస్తారని వాపోయింది. 'అమ్మా నువ్వు త్వరగా రాకపోతే నన్ను చంపేస్తారు' అంటూ కన్నీరు పెట్టుకుంది.
బిడ్డ ఏడుపుతో తల్లడిల్లిన ఆ తల్లి వెంటనే ఆమె ఇంటికి పరుగులు పెట్టింది. కానీ ఆ తల్లి గుమ్మంలోకి అడుగుపెట్టగానే.. కూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో గుండెల బాదుకుంటూ ఆ తల్లి విలపించిన తీరు ప్రతీ ఒక్కరిని కదలించింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం నరసింహాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మూడో కుమార్తె వెంకటలక్ష్మి
ప్రొద్దుటూరులోని హనుమాన్నగర్కు చెందిన వెంకటసుబ్బయ్య, వెంకటలక్షుమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారిలో మూడో కుమార్తె వెంకటలక్ష్మి. తల్లిదండ్రులు చేనేత పని చేస్తుంటారు.
లక్ష్మికి తొమ్మిదేళ్ల క్రితం ఖాదర్బాద్కు చెందిన వెంకటేష్తో వివాహం జరిపించారు. పెళ్లయ్యాక వెంకటేష్ కుటుంబం ప్రొద్దుటూరు మండలంలోని నరసింహాపురం గ్రామంలో స్థిరపడింది.
భర్త వేధింపులు:
వెంకటలక్ష్మి భర్త వెంకటేష్ గతంలో చేనేత పని చేసేవాడు. ఇటీవల పిప్పర్మెంట్ ఫ్యాక్టర్లో పనికి వెళ్తున్నాడు. లక్ష్మి వెంకటేష్ లకు భరత్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కారణాలేవో తెలియదు గానీ కొన్ని రోజుల నుంచి అతను భార్యను నిత్యం వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తల్లి ఆరోపిస్తోంది.
అమ్మా.. నువ్వు రాకపోతే చంపేస్తారు:
వెంకటలక్ష్మి తన పనేదో తాను చూసుకుంటూ ఇంట్లోనే ఉండేదని స్థానికులు అంటున్నారు. చివరిసారిగా దసరా పండుగ సమయంలో ఆమె తన తల్లిగారింటికి వెళ్లి వచ్చింది. మంగళవారం ఉధయం లక్ష్మి తన తమ్ముడు సుబ్బయ్యకు ఫోన్ చేసి మాట్లాడింది. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. కొద్దిసేపటికి తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, నువ్వు త్వరగా రాకుంటే నన్ను చంపేస్తారని వాపోయింది.
గుమ్మంలో ఉరికి వేలాడుతూ
లక్ష్మి ఏడుస్తూ ఫోన్ చేయడంతో తల్లి వెంకట లక్ష్మమ్మ వెంటనే నరసింహాపురం పరిగెత్తింది.గుమ్మంలోకి వెళ్లగానే ఎదురుగా కూతురు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించడంతో ఆమె గుండె పగిలినంత పనైంది. కుమార్తెను విగతజీవిగా చూసి ఆ తల్లి బోరున విలపించడంతో చుట్టు పక్కలవాళ్లు వచ్చి లక్ష్మిని కిందికి దించారు.
అయితే అప్పటికే లక్ష్మి ప్రాణాలు విడిచింది. బంగారం లాంటి నా కుమార్తెను ఆమె భర్త, అత్త కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.