అస్తిపంజరం: మహిళ అనుమానస్పద మృతి
పోలీసులు మహిళ అస్తిపంజరాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుంటూర జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన కొక్కిలిగడ్డ సీతారామ్తో కృష్ణా జిల్లాకు కోడూరు మండలం దింటిమెరక గ్రామానికి చెందిన నాగజ్యోతికి నిరుడు అక్టోబర్లో వివాహమైంది.
పెళ్లి సందర్భంగా రూ.22 వేలు జ్యోతి తల్లిదండ్రులు కట్నం కింద ఇచ్చారు. పెళ్లయిన తర్వాత నెల రోజుల నుంచే మరింత కట్నం తేవాలంటూ నాగజ్యోతిని వేధించడం ప్రారంభించారు. మూడు నెలల క్రితం భర్త ఆమెను పుట్టింటికి పంపించాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు కూతురును తమ వద్దనే ఉంచుకున్నారు.
నెల రోజుల క్రితం సీతారామ్ తండ్రి దానారావు దింటిమెరక వెళ్లి కోడలిని కాపురానికి పంపించాలని కోరాడు. వేధింపులు ఉండవని హామీ ఇవ్వడంతో జ్యోతిని ఆమె తల్లిదండ్రులు అతనితో పంపించారు. ఈ నెల 13వ తేదీన దింటిమెరక వెళ్లి వద్దామని చెప్పి సీతారామ్ తన భార్యను గ్రామం వద్ద ఉన్న కృష్ణానదిలో పడవపై ఏటి అవతలకు తీసుకుని వెళ్లాడు.
అప్పటి నుంచి వారిద్దరు కనిపించకుండా పోయారు. అదే రోజు సెల్ఫోన్ నుంచి కుటుంబసభ్యులకు జ్యోతి ఫోన్ చేసి మాట్లాడింది. మరుసటి రోజు నుంచి ఆ ఫోన్ పనిచేయకపోవడంతో జ్యోతి తండ్రి వెంకటేశ్వర రావు ఆందోళనకు గురై బంధువులతో కలిసి 15వ తేదీన వల్లభాపురం వచ్చాడు. 13వ తేదీననే జ్యోతి దింటిమెరక వెళ్లిపోయిందని అతనితో అత్తింటివారు చెప్పారు.
తమ కుమారుడు కూడా కనిపించడం లేదని, మీరే ఏదో చేసి ఉంటారంటూ వారిపై సీతారామ్ సోదరులు వాదనకు దిగారు. దీంతో వెనుదిరిగి జ్యోతి తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో తండ్రి శనివారం కొల్లిపర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దంపతులు కనిపించడం లేదంటూ దినపత్రికలో వార్తలు రావడంతో గ్రామస్థులు కొందరు జ్యోతి వారం క్రితం లంకలో కనిపించందని చెప్పారు. దీంతో ఆమె పుట్టింటివారు అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ గుడిసె దగ్ధమై ఉంది. అందులో ఓ ఆస్తిపంజరం ఉండడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్తిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అస్తిపంజరానికి ఉన్న గాజు తన కూతురిదేనని వెంకటేశ్వర రావు తెలిపాడు. తమ కూతురిని అల్లుడే హత్య చేసి ఉంటాడని ఆరోపించాడు.