Guillain-Barre syndrome: ఏపీలో జీబీఎస్ తొలి మరణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులియన్-బారీ సిండ్రోమ్ (GBS) కలకలం రేపుతోంది. ఏపీలో జీబీఎస్ కారణంగా తొలి మరణం సంభవించింది. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ జీబీఎస్ బారినపడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడిపోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న బాధితురాలు నేటి సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది.
కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధృవీకరించారు. లక్షల మందిలో ఒకరిద్దరికి వచ్చే ఈ జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఒక్కసారిగా పెరగడం ఆందోళనకరంగా మారింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిబ్రవరి 11న ఒక్కరోజే 7 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.

ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి నలుగురు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు ఈ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఇద్దరు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. కాకినాడలోనూ ఇద్దరు జీబీఎస్ బారినపడి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు.
జీబీఎస్ అంటువ్యాధి కాకపోయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఒకరంగా పక్షవాతం లక్షణాలను కలిగి ఉంటుందన్నారు. చాలా వరకు ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వచ్చినవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడిపోతాయి. వ్యాధి లక్షణాన్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందుతే ప్రమాదకరం కాకముందే నయవుతుందని వైద్యులు చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా జీబీఎస్ వ్యాపిస్తుందన్నారు. ఎక్కువగా పెద్దవారికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలకు, శిశువులకూ సోకడం ఆందోలన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications