వైద్యులు లేక గర్భిణి అవస్థలు: 108 వాహనంలోనే ప్రసవం
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ గర్భిణి 108 వాహనంలోనే ప్రసవించాల్సి వచ్చింది. అంతక ముందు గర్భిణి మహిళను ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు లేరని చెప్పి సిబ్బంది లోనికి అనుమతించలేదు.
దీంతో ఆ గర్భిణి ఆసుపత్రి బయటే వాహనంలో అరగంట పాటు తీవ్ర అవస్థలకు గురైంది. చివరికి 108 వాహనంలోనే ఆ మహిళ ప్రసవించింది. తల్లి, పుట్టిన బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని స్ధానికులు తెలిపారు.
కాగా, ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంతరం నందిగామ ప్రభుత్వాసుపత్రి ఎదుట స్ధానికులు ఆందోళన చేపట్టారు. బాధితురాలు వీరులపాడు మండలం నందలూరు వాసిగా తెలుస్తోంది.
గోనెసంచిలో అప్పుడే పుట్టిన మగ శిశువు
అప్పుడే జన్మించిన మగ శిశువును గోనె సంచిలో కట్టి, గ్రామ చివరలో ఉన్న పాడుబడ్డ బావిలో పడేసిన ఉదంతం అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
జిల్లాలోని గోరంట్ల మండలం పుట్టగంట్లపల్లిలో పసికందును బావిలో పడేసి వెళ్లారు. దీంతో పసికందు ఏడవడంటతో స్థానికులు గమనించి వెంటనే బావి వద్దకు వచ్చి శిశువును వెలికితీసి ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతరం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ శిశువు ఎవరి పిల్లవాడు, ఎక్కడ నుంచి తీసుకువచ్చి పడవేశారనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.