ఒంగోలులో దారుణం: మహిళను నిర్బంధించి వ్యభిచారం.. అరెస్టు
హైదరాబాద్: ప్రకాశం జిల్లా ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం జరిగింది. కొంత మంది దుండగులు ఓ మహిళను నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెల్లవారుజామున అర్థనగ్నంగా పరిగెడుతున్న ఓ మహిళను స్థానికులు చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. తనకు మత్తు మందు ఇచ్చి గత కొంత కాలంగా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఆ మహిళ వాపోయింది. వ్యభిచారం చేసేందుకు ఒప్పుకోకపోవడంతో, తీవ్రంగా హింసించారని పేర్కొంది.
అంతేకాకుండా ఆమెను వివస్త్రను చేసి బంధించారు. స్ధానికుల సమాచారంతో ఛైల్డ్ లైన్ ప్రతినిధులు బాధిత మహిళకు విముక్తిని కల్పించారు. మహిళను బంధించిన ఇంటి నుంచి భారీగా మద్యం, డ్రగ్స్, కండోమ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గ్వాలియర్లో అదృశ్యమైన తెలుగు విద్యార్థి క్షేమం
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ట్రిపుల్ ఐటీ చదువుతున్న తెలుగు విద్యార్థి ప్రవీణ్ కుమార్ దాస్ అదృశ్యమయిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి అతను కనిపించడం లేదని సహచర విద్యార్థులు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.
అయితే, తాను క్షేమంగానే ఉన్నానంటూ ప్రవీణ్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. విశాఖపట్నంలోని కేఆర్ఎం కాలనీకి చెందిన ట్రీపుల్ఐటీ విద్యార్థి ప్రవీణ్ కుమార్ దాస్ గ్వాలియర్లో అదృశ్యమైన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేఆర్ఎం కాలనీకి చెందిన ఆ విద్యార్థి గ్వాలియర్ ఏబీవీ ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.