సౌదీ పీడ: మహిళకు నరకం చూపించారు (ఫొటోలు)
హైదరాబాద్: సౌదీ అరేబియాలో అరబ్ షేక్ల ఆగడాలకు నరకం చవి చూసిన హైదరాబాదు మహిళకు పోలీసులు విముక్తి కలిగించారు. సౌదీ అరేబియాలో 50 వేల రూపాయల వేతనమని, చిన్న పాపకు సంరక్షకురాలిగా ఉంటే చాలు, అంత మొత్తం వచ్చేస్తుందని నమ్మించిన ఓ ఏజెంట్ ఆమెను సౌదీ అరేబియాకు పంపించాడు.
అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె బాధ వర్ణనాతీతంగా ఉంది. బంజారాహిల్స్ జహీర్నగర్లో నివాసం ఉండే ప్రగతిరాణి శర్మ అనే గృహిణి అత్తాపూర్కు చెందన ఏజెంట్ అహ్మద్ మాటలు నమ్మి 45 రోజుల క్రితం సౌదీ ఆరేబియాలోని రియాద్కుి వెళ్లింది. విధుల్లో చేరినప్పటి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.
మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో పాటు అనేక పనులతో యజమానులు నరకాన్ని చూపించారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు సైతం పంపించారు. ఈ బాధలు భరించలేక ఆమె బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏజెంట్లు నస్రీన్, అహ్మద్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వారిపై ఒత్తిడి తెచ్చి రెండు రోజుల క్రితం బాధితురాలిని నగరానికి రప్పించినట్లు హైదరాబాద్ వెస్ట్ జోన్ డిసిపి సత్యనారాయణ బుధవారం మీడియాతో చెప్పారు. గల్ఫ్లో ఉద్యోగాల పేరిట ఎవరూ మోసానికి గురి కావద్దనే ఉద్దేశంతో బాధితురాలి కోరిక మేరకు మీడియా ముందుకు తీసుకుని వచ్చినట్లు చెప్పారు.