పొలం కోసం మనవడికి విషమిచ్చి హత్య: నానమ్మకు జైలు
గుంటూరు: గ్రామంలోని కొద్దిపాటి పొలం కోసం కన్న కుమారుడి కుటుంబాన్నే హతమార్చాలని చూసి ఆరేళ్ల మనవడి మరణానికి కారణమైన నానమ్మకు జీవితఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం రఫి తీర్పుచెప్పారు. మంగమ్మ అనే మహిళపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదుతో పాటు 1500 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రఫి తీర్పుచెప్పారు.
జిల్లా ప్రధాన కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ ఈ కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం - పిట్టలవానిపాలెం మండలం, గౌడపాలెంకు చెందిన బొలగాని మంగమ్మకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు బొలగాని ధర్మారావు కొంతకాలం గ్రామంలోనే కూలిపనిచేసి వెల్డింగ్ పనికోసం ఢిల్లీ వెళ్లాడు. అక్కడ పూనం అనే యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు.
అతనికి జాహ్నవి, వినయ్ సంతానం కలిగారు. ఢిల్లీలో సరిగా పని దొరకక పోవడంతో సంఘటనకు కొంతకాలం క్రితం తిరిగి గౌడపాలెంకు చేరుకున్నాడు. ధర్మారావు, పూనంలకు గొడవలు రావడంతో ఆమె పిల్లల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లింది. దీంతో మద్యానికి బానిసైన దర్మారావు 2012లో మృతిచెందాడు. ఈ విషయం ధర్మారావు తల్లి మంగమ్మ ఢిల్లీలో ఉన్న కోడలు పూనంకు తెలియజేయడంతో ఆమె కూడా గౌడపాలెంకు చేరుకుంది.
పూనం ఎంతకీ తిరిగి ఢిల్లీకి వెళ్లకపోవడంతో వారికి ఉన్న నాలుగు శెంట్ల వ్యవసాయ భూమిని కోడలుకు దక్కనీయకుండా చేయాలనే ఉద్దేశంతో మంగమ్మ పధకం రూపొందించింది. 2013 డిసెంబర్ 9వ తేదీన సాంబారులో ఎలుకల మందు కలిపి కోడలు, మనవడు వినయ్లకు వడ్డించింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన వినయ్ను చెరుకుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కోడలు పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో పొన్నూరులో చికిత్స చేయించారు.
అయితే ఈ సంఘటనతో భయపడిన మంగమ్మ తాను చేసిన నేరాన్ని పిట్టలవానిపాలెం విఆర్ఒ వల్లూరి హేమంత్కుమార్ వద్దకు వెళ్లి ఒప్పుకుంది. మంగమ్మ నుండి స్టేట్మెంట్ తీసుకుని చందోలు పోలీసులకు విఆర్ఒ అప్పగించారు. బాపట్ల రూరల్ సిఐ వై రామారావు మంగమ్మను అరెస్ట్ చేసి ఛార్జిషీటు దాఖలు చేశారు.