జల్సాలకు అడ్డుగా ఉన్నాడని కొడుకునే చంపేసిన తల్లి
చిత్తూరు: ఆమె ప్రవర్తనకు విసిగిపోయిన భర్త వదిలేశాడు. జల్సాలకు అడ్డువస్తున్నాడని ఆమె తన కన్నపేగునే కడతేర్చింది. ఈ సంఘటన చిత్తూరులో జరిగింది. చిత్తూరు నగరంలోని దుర్గానగర్కు చెందిన రేఖ (20) బెంగుళూరుకు చెందిన ఒక యువకుడిని 2013లో వివాహం చేసుకుంది.
వారికి యశ్వంత్ అనే తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడంతో కొంత కాలం క్రితం భర్త ఆమెను వదిలేశాడు. దాంతో ఆమె చిత్తూరులోని పుట్టినిల్లుకు చేరుకుంది. ఇక్కడ ఒంటరిగా జీవిస్తోంది. జల్సాలకు మరిగిన ఆమెకు కుమారుడు అడ్డుగా కనిపించాడు.
మార్చి 9వ తేదీన కుమారుడు ఏడుస్తుండడంతో కోపం వచ్చి గొంతుకు తాడు బిగించి చంపేసింది. తాను వచ్చి చూసే సరికి పిల్లవాడు గుక్క పట్టి ఏడ్చి అపస్మారక స్తితిలోకి వెళ్లిపోయాడని చుట్టుపక్కలవారికి చెప్పింది. బిడ్డును తీసుకుని నగరంలోని బౌండీ వీధిలో ఉండే తన చిన్నాన్న చినబాబు ఇంటికి వెళ్లి బిడ్డును అక్కడ వదిలేసి పారిపోయింది.
బిడ్డ మరణించిన విషయం గుర్తించిన చినబాబు అదే రోజు అంత్యక్రియలు కూడా చేశాడు. ఆ తర్వాత పిల్లాడి మృతిపై అనుమానం ఉందని చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని ఎస్ఐ ప్రసాద్ రెవెన్యూ అధికారుల సమక్షంలో బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం చేసి మళ్లీ అంత్యక్రియలు చేశారు.
రెండు రోజుల క్రితం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేయడం వల్లనే పిల్లవాడు మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీులు రేఖను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. ఆమెను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు.