భార్య చేసిన హత్య: కొట్టి, నోట్లో ఎండ్రిన్ పోసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది
విజయవాడ: భర్త పట్ల ఓ భార్య అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. సంపాదించడం లేదనే కారణంతో, వైద్యానికి డబ్బులు ఖర్చవుతున్నాయనే కారణంతో భర్తను దారుమైన రీతిలో హత్య చేసింది. ఆమెకు కుమారుడు, కోడలు సహకరించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో సోమవారం జరిగింది.
భర్తపై మొదట ఆమె తీవ్రంగా దాడిచేసింది. తర్వాత నోటిలో ఎండ్రిన్పోసింది. దాంతో ఆగకుండా ఒంటిపై కిరోసిన్పోసి నిప్పంటించింది. కొడుకు, కోడలు సాయంతో భార్య చేసిన ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుకొండలు చికిత్స పొందుతూ మరణించాడు.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని యాకమూరు నివాసి అయిన శొంఠి ఏడుకొండలు(47)కు భార్య వీరకుమారి, కొడుకు వీరబాబు ఉన్నారు. కొడుక్కు కొంతకాలం క్రితం వివాహం కూడా చేశాడు. అయితే కొన్ని రోజుల క్రితం ఏడుకొండలుకి మానసిక సమస్య ఏర్పడింది. దీంతో, విజయవాడలోని డాక్టర్కు చూపించి కుటుంబ సభ్యులు మందులు వాడుతున్నారు.
కానీ ఏడుకొండలు కుదురుకోలేక పోయాడు. పనులు సరిగా చేయలేకపోయాడు. దీంతో పనికి వెళ్లకపోగా మందులకు డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోందని భార్య, కొడుకు అంటూ ఉండేవారు. వారం రోజుల క్రితం కొడుకు వీరబాబు ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా తండ్రి కాళ్లపై కొట్టి ఇంటి నుంచి గెంటివేశాడు.
వీరకుమారి, వీరబాబులను స్థానికులు, సర్పంచి మందలించి, ఏడుకొండలును తిరిగి ఇంటికి తీసుకెళ్లేలా చేశారు. ఈ క్రమంలోనే సోమవారం అంకమ్మతల్లి గుడివద్ద ఉన్న ఏడుకొండలును ఇంటికి తీసుకెళ్లారు. కానీ, మధ్యాహ్నం 12.30 గంటలకు భార్య, కొడుకు, కోడలు కలసి ఏడుకొండలును తీవ్రంగా కొట్టి, ఇంటినుంచి బయటకు తోసేశారు.
నోట్లో పురుగుల మందు, ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ దురాగతాన్ని ఏడుకొండలు అన్నయ్య వీరసత్యనారాయణ చూసి మంటలను ఆర్పి రక్షించాడు. ఆ సమయంలో చుట్టుపక్కల వారిపై కూడా వీరకుమారి, వీరబాబు దాడిచేయటంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా మీద పడే ప్రయత్నం చేశారు. దీంతో వీరకుమారి, వీరబాబు, శ్రీదేవి(వీరబాబు భార్య) ఇంట్లోకెళ్లి గడియ పెట్టుకున్నారు. కాలిన గాయాలతో ఉన్న ఏడుకొండలును స్థానికుల సహాయంతో ఆయన అన్న అంబులెన్స్లో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
పరిస్థితి విషమించిన ఏడుకొండలు చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ విజయ భాస్కర్, సీఐ సత్యనారాయణ, పమిడిముక్కల ఎస్సై రమేష్ కుమార్ యాకమూరు వచ్చి ఏడుకొండలు ఇంటిని పరిశీలించారు. ఇంటిలో దాగిన వీరకుమారిని, ఆమె కొడుకు, కొడలును అదుపులోకి తీసుకున్నారు.