వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని 17ఏళ్ల కొడుకును దారుణంగా చంపింది
విజయనగరం: జిల్లాలోని గాయత్రి నగర్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ తల్లి కన్నకొడుకును చంపేసింది. నిద్రమాత్రలు కలిపి భోజనం పెట్టి, చున్నీతో ఉరివేసింది ఆ కసాయి తల్లి. ప్రియుడు గోవింద్ పాత్ర పైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఫేస్బుక్లో నగ్నచిత్రాలు పెడతానని..: ఎస్సై కారు డిక్కీలో వెళ్లి పక్కా ప్లాన్తో అరెస్ట్
ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. కొండల్రావు, వెంకటపద్మావతిలు దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు హరిభగవాన్ ఇంటర్ చదువుతున్నాడు. కూతురు ఉమాదేవి పదోతరగతి చదువుతోంది.
వెంకటపద్మావతి తీరు నచ్చక కొండల్రావు ఆరేళ్ల క్రితమే విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలు తల్లివద్దే ఉంటున్నారు. భర్త విడాకులు ఇచ్చాక అదే ప్రాంతానికి చెందిన గోవింద్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ప్రతి రోజు గోవింద్ ఇంటికి వచ్చి వెళ్లడం కొడుకు హరిభగవాన్కు నచ్చలేదు. ఈ విషయంలో తల్లితో చాలాసార్లు గొడవపడ్డాడు. దీంతో కొడుకును తొలగించుకోవాలని తల్లి నిర్ణయించుకుంది. మంగళవారంరాత్రి కొడుకు తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. అతను నిద్రపోయాక చున్నీతో ఉరివేసి చంపేసింది.
ఆ తర్వాత కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నాలు చేసింది. ఆమె చెబుతున్న తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. తానే హత్య చేసినట్లు అంగీకరించింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి పాత్రపై దర్యాఫ్తు చేస్తున్నారు.