స్టూడెంట్ తో లేడి లెక్చరర్ లవ్ ట్రాక్..!, ఇద్దరే ఏడురోజులు..
విశాఖ / పీఎంపాలెం : అతనో 19 ఏళ్ల విద్యార్థి.. ఆమె 28 ఏళ్ల లెక్చరర్.. వయసు, వివాహాం, ఆమె ఐదేళ్ల పాప ఇవేవి వారి ప్రేమకు అడ్డు రాలేదు. పాఠాలు నేర్చుకోవడానికి కాలేజీకి వెళ్లిన అతను, పాఠాలు చెప్పే ఆ పంతులమ్మ.. పాఠాల ట్రాక్ తప్పి ప్రేమను పట్టాలెక్కించారు. ఇంకేముంది..? ఇద్దరూ కలిసి జంప్.
వివరాల్లోకి వెళితే.. చంద్రంపాలెంలోని తన తాతగారి ఇంటి వద్ద ఉంటూ ఓ కార్పొరేట్ కాలేజీలో బీఎస్సీ సెకెండ్ ఇయర్ చదువుతున్నాడు మణికంఠ (19) అనే విద్యార్థి. ఇదే కాలేజీలో సంతోష లక్ష్మి (28) అనే వివాహిత కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. ఆమెకు ఐదేళ్ల పాప కూడా ఉన్నట్టు సమాచారం.
అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో ఏమో గానీ.. గతంలోను ఇద్దరూ కలిసి ఓ వారం రోజుల పాటు ఊరి నుంచి మాయమైపోయారు. ఆ సమయంలో ఇద్దరూ హైదరాబాద్ లో ఉన్నట్టు తెలియడంతో ఇరువురి బంధువులు ఆ ఇద్దరిని తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇద్దరూ దూరంగానే ఉన్నా.. తాజాగా ఇద్దరు మళ్లీ మాయమవడంతో కథ మొదటికొచ్చింది.
సంతోష లక్ష్మికి దూరంగా ఉంటూ వస్తోన్న క్రమంలోనే కొద్దిరోజుల క్రితం మణికంఠకు యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఇంటికే పరిమితమైన అతను, వారం రోజుల క్రితం కొద్దిగా కోలుకుని ఇంటినుంచి బయటకు అడుగుపెట్టాడు. ఇక అప్పటినుంచి మళ్లీ ఇంటికి రాలేదు. దీంతో మణికంఠ ఆచూకీ కోసం ప్రయత్నిస్తోన్న కుటుంబ సభ్యులకు సంతోష లక్ష్మి కూడా లేదని తెలియడంతో, ఇద్దరూ కలిసి మళ్లీ ఎక్కడికైనా పారిపోయి ఉంటారని భావించారు కుటుంబ సభ్యులు.
అయితే మణికంఠ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంతోష లక్ష్మి శ్రీకాకుళంలో ఉన్నట్టు తెలిసింది. దీంతో పోలీసులు ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించగా.. మణికంఠ గురించి తనకు తెలియదని చెప్పడంతో.. మణికంఠ మిస్సింగ్ మిస్టరీగా మారింది.