పెళ్లైన మూడోరోజే ప్రియుడితో!.. ఇప్పుడా యువతి పరిస్థితి అగమ్యగోచరం
ప్రియుడిని గుడ్డిగా నమ్మిన ఆ యువతి.. పెళ్లైన మూడో రోజే భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది.
తిరుపతి: ప్రేమించాడు.. కానీ పెళ్లి మాటెత్తేసరికి నో అన్నాడు. దీంతో చేసేదేమి లేక ఆ యువతి వేరొకరిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన మరుసటి రోజు నుంచే.. మళ్లీ ప్రేమ.. ప్రేమ.. అంటూ వెంటపడ్డాడు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ మాయ మాటలు చెప్పడం మొదలుపెట్టాడు.
ప్రియుడిని గుడ్డిగా నమ్మిన ఆ యువతి.. పెళ్లైన మూడో రోజే భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. కొన్నాళ్లు ప్రియుడితో జీవితం సాఫీగానే సాగినా.. సీన్ లోకి అతని తల్లిదండ్రులు ఎంటరవడంతో కథంతా అడ్డం తిరిగింది. ప్రియుడి తల్లిదండ్రులు అతన్ని తీసుకెళ్లిపోవడంతో.. దిక్కులేని దానిలా ఇప్పుడా యువతి రోడ్డు మీద పడింది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన షాహినా, సోమశేఖర్లు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఇదే క్రమంలో షాహీనా పెళ్లి మాటెత్తేసరికి సోమశేఖర్ ససేమిరా అన్నాడు. చేసేదేమి లేక ఇంట్లోవాళ్లు చూసిన వ్యక్తితో షాహీనా వివాహం చేసుకుంది.
అలా వివాహం అయిందో లేదో.. మళ్లీ పాత ప్రియుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు లేకపోతే బ్రతకలేను అంటూ మభ్యపెట్టాడు. అతని మాటలు నమ్మి పెళ్లైన మూడోరోజే అతనితో పాటు షాహీనా విజయవాడ వెళ్లిపోయింది. అలా 40రోజులు గడిచాక.. ప్రియుడి తల్లిదండ్రులు 'మేమే తిరుమలలో వివాహం జరిపిస్తామని' ఫోన్ ద్వారా నమ్మబలికారు. దీంతో షాహినాను తీసుకుని రేణిగుంట బుగ్గవీదిలోని తమ ఇంటికి వచ్చాడు సోమశేఖర్.
అయితే అతని తల్లిదండ్రులు మాత్రం.. సోమశేఖర్ ను ఇంట్లోకి రానిచ్చి, షాహీనాను మాత్రం గెంటేశారు. అర్థరాత్రి పూట జరిగిన ఈ ఘటనతో.. ఎక్కడికెళ్లాలో తెలియక.. ఆ యువతి కన్నీరుమున్నీరైంది. తనకు జరిగిన అన్యాయం గురించి కనిపించిన ప్రతీ ఒక్కరిని వేడుకుంటోంది. పుట్టింటివాళ్లు కూడా ఇప్పడు షాహీనాను చేరదీసే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.